మెదక్ జిల్లా, మండల కేంద్రంలోని సెంట్రల్ బ్యాంకులో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి ప్రయత్నించారు. అయితే, బ్యాంకులో సేఫ్టీ అలారం మోగడంతో దొంగలు పరారయ్యారు. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం… స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న సెంట్రల్ బ్యాంకు భవనం వెనుక వైపు నుంచి ఆదివారం అర్ధరాత్రి సుమారు ఒకటిన్నర గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని దొంగలు గోడకు రంధ్రం చేసి స్టోర్ రూమ్లోకి వెళ్లి తలుపు ధ్వంసం చేసి లోపలికి వెళ్లారు.
లాకర్ను తీసేందుకు ప్రయత్నించగా సేఫ్టీ అలారం మోగడంతో దొంగలు వెంటనే బయటకు వెళ్లిపోయారు. అలారం శబ్దం రావడంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా విషయం తెలుసుకున్న తూప్రాన్ డిఎస్పి నరేందర్గౌడ్, సిఐ రంగాకృష్ణ, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి బ్యాంకును పరిశీలించారు. మెదక్ క్లూస్ టీం బృందం బ్యాంకులో ఆధారాలను సేకరించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.