ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపిఎల్ ట్రోఫీ కల తీరింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగళూరు తన ఖాతాలో తొలి టైటిల్ను జత చేసుకుంది. మంగళవారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో బెంగళూరు ఆరు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఛాలెంజర్స్ బౌలర్లు సఫలమయ్యారు. కీలకమైన ఫైనల్లో పంజాబ్ బ్యాటర్లు తేలిపోయారు. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (24), ప్రభ్సిమ్రన్ సింగ్ (26)లు శుభారంభం అందించిన ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపింది. జోష్ ఇంగ్లండ్ (39), శశాంక్ సింగ్ 61 (నాటౌట్)లు తప్ప మిగతా వారు విఫలం కావడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు. బెంగళూరు బౌలర్లలో కృనాల్, భువనేశ్వర్ రెండేసి వికెట్లను పడగొట్టారు.
కోహ్లి ఒక్కడే..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆశించినస్థాయిలో శుభారంభం దక్కలేదనే చెప్పాలి. ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్డౌన్లో వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమయ్యాడు. 18 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ రజత్ పటిదార్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 15 బంతుల్లో రెండు సిక్స్లు, ఒక ఫోర్తో 26 పరుగులు చేసి ఔటయ్యాడు.
మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి 35 బంతుల్లో 3 ఫోర్లతో 43 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక లివింగ్స్టోన్ తన పేలవమైన బ్యాటింగ్ను ఫైనల్లోనూ కొనసాగించాడు. మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. రెండు సిక్స్లతో 25 పరుగులు చేసి పెవిలియన్బాట పట్టాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ కూడా 24 పరుగులు మాత్రమే చేసి వెనక్కి వెళ్లాడు. రొమరియో షెఫర్డ్ (17) పరుగులు సాధించాడు. దీంతో బెంగళూరు స్కోరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులకు చేరింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్, జేమిసన్ మూడేసి వికెట్లను పడగొట్టారు.