ఐపిఎల్ సీజన్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం ఏకపక్షంగా సాగిన తొలి క్వాలిఫయర్లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసిం ది. క్వాలిఫయర్ 2 విజేతతో బెంగళూరు ఫైనల్లో తలపడుతుంది. ఇక పంజాబ్తో జరిగిన పోరులో ఛాలెంజర్స్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఏ దశలోనూ పంజాబ్కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ను 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూల్చింది. తర్వాత లక్షఛేదనకు దిగి 10 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ అద్భుత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు.
పంజాబ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సాల్ట్ 27 బంతుల్లోనే ఆరు ఫోర్లు, 3 సిక్స్లతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లి (12), మయాంక్ అగర్వాల్ (19) పరుగులు చేసి ఔటయ్యారు. కెప్టెన్ రజత్ పటిదార్ 8 బంతుల్లోనే అజేయంగా 15 పరుగులు సాధించాడు. దీంతో బెంగళూరు అలవోక విజయంతో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ప్రభ్సిమ్రన్ (18), స్టోయినిస్ (26), అజ్మతుల్లా (18) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. బెంగళూరు బౌలర్లలో హాజిల్వుడ్, సుయాష్ శర్మ మూడేసి వికెట్లను పడగొట్టారు. యశ్ దయాల్కు రెండు వికెట్లు లభించాయి.