Monday, April 29, 2024

నేటితో అన్నదాతకు రూ.50000 కోట్లాభిషేకం

- Advertisement -
- Advertisement -

Rythu Bandhu scheme reaches Rs 50 billion milestone

ప్రపంచ పటంలో రైతుబంధు
సరికొత్త మైలురాయి అందుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కలల పథకం
సంబురాల్లో మునిగి తేలుతున్న తెలంగాణ రైతాంగం

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగానికి అండగా నిలిచి రాష్ట్ర రైతాంగం కోసం సిఎం కేసిఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం రూ.50వేలకోట్ల మైలురాయిని చేరుకుని తెలంగాణను ప్రపంచ చిత్రపటంలోకి ఎక్కేలా చేసింది. గత నెల 28నుంచి ప్రారంభించిన రైతుబంధు నిధుల పంపిణీ కార్యక్రమం సోమవారం నాటితో ముగియనుంది. తొలుత ఎకరం లోపు రైతుల ఖాతాలకు నిధులు జమతో ప్రారంభించి రోజుకు ఎకరం చొప్పున రెండు ఎకరాలకు , మూడు ఎకరాలకు పెంచుకూంటూ వస్తూ జనవరి 10వ తేది నాటికి రైతులందరికి నిధులు అందించే కార్యక్రమం విజయవంతంగా పూర్తి కానుంది .రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా భావించే ఈ పథకం రైతుకుటుంబాల్లో నూతన ఉత్తేజాన్ని తెచ్చింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి రాష్ట్రమంతటా రైతుబంధు విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తోంది. సంక్రాతి పండగ వరకూ ఈ ఉత్సవాలను కొనసాగిస్తోంది. అయితే యాసంగిలో పంటల సాగుకు పెట్టుబడి ఖర్చుల కింద రైతుబంధు పథకం ద్వారా రూ.7645.66కోట్లు అందజేసే కార్యక్రమం సోమవారం నాటికే పూర్తికానుంది.

ఒక్కొ ఎకరానికి రూ.5000 చొప్పున మొత్తం 152.91లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ పూర్తి కానుంది. . ఈ సీజన్‌లో రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలో 66.61లక్షల మంది రైతులకు లబ్ది కలుగుతోంది. . ఇందులో 3.05లక్షల ఎకరాలకుగాను 94వేల మంది ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాదారు రైతులకు కూడా ప్రయోజనం కలిగింది. . డిసెంబర్ 10వతేది నాటికి ధరణి పోర్టల్‌నందు పట్టాదారులుగా ,ట్రైబల్ వెల్ఫేర్ కమీషనర్ ద్వారా అందిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారులకు కూడా రైతుబంధు పథకం కింద ప్రయోజనం కలిగింది. టిఆర్‌ఎస్ సర్కారు గత వర్షాకాల సీజనల్‌లో రూ.7508.78కోట్ల రూపాయలు రైతుబంధు పథకం ద్వారా రైతులకు అందజేసింది. 150.18లక్షల ఎకరాలకు సంబంధించిన 63,25,695మంది రైతుల బ్యాంకు ఖాతాలను ఈ మేరకు నగదు జమ చేసింది. ఈ పథకం కింద పంటల సాగుకు పెట్టుబడి సాయం అందుకున్న రైతులు ఎంతో ఉత్సాహంగా పంటలు సాగు చేసి గణనీయమైన దిగుబడులు సాధించగలిగారు.

అత్యధికంగా 61లక్షల ఎకరాల్లో వరిసాగు చేసి తద్వారా రికార్డు స్థాయిలో కోటి38 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాం పండించగలిగారు. అంతే కాకుండా వాణిజ్య పంటల్లో ప్రధానంగా 50.94లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగుచేసి 69.46లక్షల బేళ్ల పత్తి దిగుబడులను సాధించగలిగారు. కంది.పెసర, మినుము, వేరుశనగ , సోయా , పసుపు,మిరప తదితర రకాల పంటల దిగుబడిని కూడా గణనీయంగా పెంచి ఆర్ధికంగా ఆదాయాన్ని సమకూర్చుకోవటంతోపాటు కరోనా కష్టకాలంలో రాష్ట్ర జిడిపి వృద్ధికి వ్యవసాయరంగం ద్వారా రైతులు పెద్ద ఎత్తున చేయూత నిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుబందు పథకం ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకూ ఏడు విడతలలో రూ.43,036.63కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సీజన్‌తో కలుపుకొని మొత్తం రూ.50వేల కోట్లు రైతుబంధు పథకం ద్వారా రైతులకు నగదు పంపిణీ విజయవంతంగా ముగుస్తోంది. ఈ పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తుమ 20పథకాలలో ఒకటిగా రోమ్‌లో 2018నవంబర్‌లో జరిగిన అంతర్జాతీ సదస్సులో ఎఫ్‌ఎఒ ప్రశంసించిందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

సంబరాల్లో తెలంగాణ 

రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం నుంచి రైతులు పోందిన పంటల పెట్టబడి సాయం రూ.50వేలకోట్ల మార్కును చేరుకుంటున్న సందర్బంగా తెలంగాణ అంతటా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మొదలుకొని అన్ని జిల్లాల్లో ఈ సంబరాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యావద్ సోమవారం ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబంధు ఉత్సవ సంబరాలను సంక్రాంతి పండగకు మించిన రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు జిల్లాల్లో కూడా మంత్రులు , ఆధికార పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున రైతుబంధు ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News