Thursday, May 2, 2024

నిబంధనల మేరకే వర్సిటీల బిల్లు

- Advertisement -
- Advertisement -

సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు రాకుండా చూశాం
యుజిసి నిబంధనలకు అనుగుణంగా బిల్లు
గవర్నర్‌కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ
గవర్నర్ సందేహాలను నివృత్తి చేసిన మంత్రి 
కొత్త విధానంతో వచ్చే సౌలభ్యం గురించి చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్: యూనివర్సిటీలలో ఉమ్మడి నియామక బోర్డు బిల్లులపై విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు వివరణ ఇచ్చారు. గవర్నర్ తమిళిసైతో గురువారం మంత్రి సబితాఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రితో పాటు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్. లింబాద్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చారు. యుజిసి నిబంధనల అమలు, న్యాయపరమైన అం శాలు, రిజర్వేషన్లు వంటి వాటిపై గవర్నర్ వివరాలు అడిగినట్లు తెలిసింది. అన్ని నిబంధనలు పాటిస్తున్నామని సాంకేతిక, న్యాయపరమైన స మస్యలు లేకుండా, యుజిసి నిబంధనల మేర కు నియామకాలు చేపట్టేలా బిల్లును తీసుకువచ్చామని తెలిపారు. ప్రస్తుత విధానంలో ఉన్న ఇబ్బందులు, కొత్త విధానంతో వచ్చే సౌలభ్యా న్ని గవర్నర్‌కు మంత్రి వివరించారు. నియామకాలు త్వరగా జరిగేందుకు, సజావుగా సాగేందుకు చేపట్టాల్సిన అన్ని విషయాలపై గవర్నర్‌కు సబిత నివేదిక అందించారు.

అయితే ఉమ్మడి నియామక బిల్లు తీసుకువచ్చే ముందు వర్సిటీలకు ఛాన్స్‌లర్‌ను అయిన గవర్నర్ సంప్రదించకపోవడం పట్ల తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌తో పాటు వైస్ ఛాన్స్‌లర్లను సంప్రదించి అందరి అభిప్రాయాలు తీసుకుని బిల్లు తీసుకువస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొత్త విధానం అమలు ద్వారా న్యాయపరమైన, సాంకేతిక పరమైన సమస్యలు ఏమైనా వస్తాయా..? అర్హులకే ఉద్యోగాలు లభించేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారు..తదితర అంశాలపై మంత్రిని, అధికారులను గవర్నర్ అడిగినట్లు తెలిసింది. బోర్డు ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత అవసరం, నిష్పాక్షిక పద్ధతిలో వీలైనంత త్వరగా నియామకాలు చేపట్టాలని అ న్నారు. ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి యుజిసి నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అభ్యర్థులకు ఎ లాంటి సమస్యలు రాకుండా చూడాలని తెలిపారు. అలాగే యూనివర్సిటీలలో హాస్టల్, లేబరేటరీలలో సౌకర్యాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వర్సిటీలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ తమిళిసై సూచించారు. విశ్వవిద్యాలయాలలో లైబ్రరీ సౌకర్యాలు మెరుగుపరచడంతోపాటు డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. విశ్వవిద్యాలయాల సర్వతోముఖాభివృద్ధికి ఛాన్సలర్ కనెక్ట్ ద్వారా పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని చెప్పారు.

ఫోన్ ద్వారా గవర్నర్ సమయాన్ని కోరిన విద్యాశాఖ
యూనివర్సిటీ ఉమ్మడి నియామక బిల్లుపై సందేహాలు నివృత్తి చేసేందుకు సమయం ఇస్తే.. వచ్చి చర్చిస్తామని విద్యాశాఖ అధికారులు గవర్నర్ కార్యాలయాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఉదయం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ.. గవర్నర్ కార్యాలయ అధికారులతో ఫోన్ ద్వారా గవర్నర్ సమయాన్ని కోరారు. గవర్నర్ సమయం ఇస్తే.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తాను, ఇతర అధికారులు వచ్చి యూనివర్సిటీల నియామక బిల్లుపై చర్చిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాజ్‌భవన్ నుంచి కబురు రావడంతో గురువారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌తో మంత్రి సబిత భేటీ అయ్యారు. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుపై సందేహాలు నివృత్తి చేయడానికి విద్యాశాఖ మంత్రి రావాలంటూ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి గవర్నర్ లేఖ రాయడం తెలిసిందే.

సబిత భేటీపై గవర్నర్ ట్వీట్
యూనివర్సిటీలలో ఉమ్మడి నియామక బోర్డు బిల్లులపై విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ అయ్యాయి. ఈ విషయాన్ని గవర్నర్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. గవర్నర్ తన ట్వీట్‌ను పిఎంఒ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యాశాఖ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ఎఐసిటిఇలకు ట్యాగ్ చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి భేటీలో పాల్గొన్నారని పేర్కొన్నారు.

Sabitha Indra Reddy meets Governor Tamilisai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News