ఆర్టీసీ బస్టాండ్లు, బస్ డిపోల్లో సానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు
సహేలి అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో త్వరలో ప్రారంభం
: మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే ఆర్టీసీ బస్టాండ్లో తొలిసారిగా శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి తెస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా సహేలి అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ములుగు, హనుమకొండ బస్టాండ్లో నాప్కిన్ వెండింగ్ మిషన్లను త్వరలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు శుక్రవారం ప్రజాభవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నెలసరి సమస్యలు ఎదుర్కొంటున్న మహిళా ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ వినూత్న ఆలోచన చేసినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం, రవాణా శాఖ, ఆర్టీసీ సహకారంతో పది రోజుల్లో ములుగు, హనుమకొండ బస్టాండ్లలో సానిటరీ నాప్కిన్ మిషన్లను సహేలీ సంస్థ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఆ తర్వాత హుస్నాబాద్, హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకి విస్తరిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీతో సహేలి ఒప్పందం కుదరచుకుందని వివరించారు. సహిలి సంస్థను స్థాపించి మహిళ ఆరోగ్య విషయంలో పనిచేయడంపై మంత్రులు అభినందనలు తెలిపారు.
బస్సులలో ప్రయాణం చేసే మహిళలు, అమ్మాయిలకు ఆకస్మికంగా నెలసరీ సమస్యలు వస్తే ప్యాడ్స్ దొరకగా ఇబ్బందులు పడడాన్ని దృష్టిలో ఉంచుకుని బస్టాండ్లలో నాప్కిన్లు అందుబాటులోకి తెచ్చే వెండింగ్ మిషన్లను బస్టాండ్ లో ఏర్పాటు చేసేందుకు సహేలి సంస్థ ముందుకు రావడంతో మంచి పరిణామమని పేర్కొంటూ సహేలి సంస్థ వ్యవస్థాపకురాలు కొమ్ము అనుపమకు మంత్రులు అభినందనలు తెలిపారు.