న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. సిఎఎని సవాలు చేస్తూ దాఖలైన 144కి పైగా పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రాన్ని సమాధానం కోరుతూ నాలుగు వారాల వ్యవధిని ఇచ్చింది. అంతేగాక సిఎఎపై దాఖలయ్యే పిటిషన్లపై విచారణ చేపట్టవద్దని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బోబ్డే నేతృత్వంలోని బెంచ్ ఎదుట కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ హాజరయ్యారు. పిటిషన్లకు సమాధానం ఇవ్వడానికి కేంద్రానికి కొంత వ్యవధి కావాలని ఆయన కోరారు. కాగా, కొందరు పిటిషనర్ల తరఫున న్యాయవాది కపిల్ సిబాల్ హాజరై ఈ పిటిషన్ల విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరారు. కాగా, సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉంది.
SC refuses to defer CAA implementation, Issues notice to Centre on petitions filed against CAA