న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపిఎల్ 2025 క్వాలిఫయర్ 2లో ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో శ్రేయస్ 41 బంతుల్లో 87 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి చారిత్రాత్మక మైలురాయిని సాధించాడు. మరే క్రికెటర్ సాధించని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను ఐపిఎల్ ఫైనల్కు తీసుకెళ్లిన తొలి కెప్టెన్గా శ్రేయాస్ నిలిచాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఐపిఎల్ ఫైనల్కు తీసుకెళ్లిన అయ్యర్.. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ ను ఫైనల్ తీసుకెళ్లడమే కాదు ఛాంపియన్ గా నిలిపాడు. ఇప్పుడు పంజాబ్ ను కూడా ఫైనల్కు తీసుకెళ్లాడు. శ్రేయాస్ ఇప్పటివరకు మూడు జట్లను ఫైనల్స్కు నడిపించగా, మరే ఇతర కెప్టెన్ ఒకటి కంటే ఎక్కువ జట్లను ఐపిఎల్ ఫైనల్స్కు తీసుకెళ్లలేదు.
ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి సంచలన విజయం నమోదు చేసింది. దీంతో జూన్ 3న బెంగళూరు జట్టుతో ఫైనల్ లో పంజాబ్ తలపడనుంది.