ఈ జాబితాలోని భూములను
రిజిస్ట్రేషన్ చేస్తే వెంటనే ప్రధాన
కార్యాలయానికి సమాచారం
వీటిని రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన
చర్యలు జూన్ 2 నుంచి
అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో
స్లాట్ బుకింగ్ ఇప్పటికే 47
చోట్ల విజయవంతంగా అమలు
నేటి గ్రామపాలన అధికారుల
పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
మంత్రి పొంగులేటి వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు రెవె న్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించా రు. స్లాట్ బుకింగ్ విధానంపై శనివారం మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిషేధిత భూముల జాబితా కోసం భూ భారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను ఏర్పాటు చేస్తామని, నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైనా ఈ నిషేధిత జాబితాలోని భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే క్షణాల్లో హైదరాబాద్లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయంలో ఆన్లైన్లో తెలిసిపోయేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.
నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్తుల క్రయ, విక్రయదారులకు పారదర్శకంగా అవినీతి రహితంగా సమయం ఆదా అయ్యేలా మెరుగైన సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా మొదటి దశలో ఏప్రిల్ 10వ తేదీన 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు. ఇక్కడ మంచి ఫలితాలు రావడంతో ఈనెల 12వ తేదీ నుంచి 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రెండు విడతల్లో కలిపి 47 చోట్ల అమలు చేసిన విధానం విజయవంతమైందని, ప్రజల నుంచి అనూహ్యస్పందన లభించిందని ఆయన తెలిపారు. 94 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని ఈ రెండు విడతల్లో కలిపి దాదాపు 36 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్ధీకరణ చేస్తున్నామని, పనిభారం అధికంగా ఉన్న పఠాన్చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం , సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్ మొత్తం తొమ్మిది చోట్ల అదనపు సబ్ రిజిస్ట్రార్లతో పాటు సిబ్బందిని నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.
మిగిలిన 97 చోట్ల స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి…
ఇప్పటికే అమల్లో ఉన్న 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో మాదిరిగానే మిగిలిన 97 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సులభతరమవుతుందని ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు, మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఆస్తుల క్రయ, విక్రయదారులు స్లాట్ బుకింగ్ తర్వాత లాగిన్లో డిపార్ట్మెంట్ పోర్టల్ లో పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలకు స్వీకారం చుట్టామని తెలిపారు.
నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేస్తే అధికారులపై కఠిన చర్యలు
ప్రజలకు వేగవంతమైన, సమర్థమైన సేవలందించడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకురావడమే కాకుండా వాటిని అమలు చేయవలసిన బాధ్యత అధికారులదేనని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.. రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా పారదర్శకత పెరుగుతుందని ఆయన అన్నారు.
పరీక్షకు పకడ్భందీ ఏర్పాట్లు
ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించడానికి ఆదివారం రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో జేఎన్టియూ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహిస్తున్నామని ఈ పరీక్షకు సంబంధించి దాదాపు ఐదు వేల మందికి పైగా హాజరవుతారని మంత్రి పొంగులేటి తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం విఆర్ఓ, విఆర్ఏల వ్యవస్దను రద్దుచేసి గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందని ఆయన విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థను పటిష్ట పరచడానికి గ్రామాల్లో రెవెన్యూ సేవల పునరుద్దరణకు చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగానే గతంలో విఆర్ఓ, విఆర్ఏలుగా పనిచేసిన వారిలో ఆసక్తి ఉన్న వారు ఈ పరీక్షకు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా వారి సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని సిఎం రేవంత్ పేర్కొన్నారు.