Saturday, July 27, 2024

నగరంలో కొట్టేసి..విదేశాల్లో జల్సాలు

- Advertisement -
- Advertisement -

మొబైల్ ఫోన్ల చోరీ వెనుక అంతర్జాతీయ ముఠాల వ్యవహారం బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. ఇక్కడ కొట్టేసిన ఫోన్లను నిందితులు షిప్పులో వేరే దేశాలకు తరలించి అక్కడ విక్రయిస్తున్నారు. ఇలా కొట్టేసిన ఫోన్ల విక్రయంతో నిందితులు కొట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఇప్పటి వరకు రెండు ముఠాలను అరెస్టు చేశారు. మొదటి ముఠాను అరెసు చేసిన సమయంలో పోలీసులకు అంతర్జాతీయ ముఠాల వ్యవహారం బయటపడడంతో మరింత దృష్టి సారించారు. కొద్ది రోజుల నుంచి మొబైల్ ఫోన్ల ముఠాపై కన్నేసి ఉంచిన పోలీసులు రెండో ముఠాలో 37మందిని అరెస్టు చేశారు. ఇందులో సుడాన్ దేశానికి చెందిన వ్యక్తి కూడా ఉండగా, మొదటి ముఠాలో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు ముఠాలలో నగరానికి చెందిన 49మందిని అరెస్టు చేశారు. అంతర్జాతీయ ముఠాలకు చెందిన నిందితులు ముందుగానే నగరానికి చెందని మొబైల్ స్నాచర్లతో టచ్‌లోకి వెళ్తున్నారు.

వారితో ఖరీదైన యాపిల్ ఫోన్లు, సామ్‌సంగ్, వన్‌ప్లస్ తదితర కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్లను చోరీ చేసి నిందితులకు అప్పగిస్తున్నారు. వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న్రారు. కొందరు నిందితులు జగదీష్‌మార్కెట్‌లో తక్కువ ధరకు మొబైల్ ఫోన్లు విక్రయిస్తుండగా, కొందరు సూడాన్ దేశానికి చెందని వారికి విక్రయించి డబ్బులు తీసుకుంటున్నారు. వీరి వద్ద కొనుగోలు చేసిన సూడాన్ దేశానికి చెందిన నిందితులు వాటిని టెక్నీషియన్లతో అన్‌లాచ్ చేయిస్తున్నారు. వాటిని విదేశాలకు షిప్పుల ద్వారా పంపించి అక్కడ మొబైల్ ఫోన్ల పార్ట్‌లను తీసి అవసరం ఉన్న వారికి ఒరిజినల్ పార్ట్ పేరుతో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కొందరు నిందితులు ఐఎంఈఐ నంబర్ మార్చి ఇక్కడే విక్రయిస్తున్నారు. మొబైల్ ఫోన్లను పార్ట్‌లు గా విభజించి విక్రయించడంతో వాటిని పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. అది కూడా విదేశాలకు తరలించడంతో పట్టుకోవడం కష్టం.

ఇలా కోట్లాది రూపాయల ఫోన్లను సూడాన్‌కు చెందిన దేశస్థులు నగరం నుంచి దాటించి లాభాలు పొందుతున్నారు. సూడాన్ దేశానికి చెందిన ఖలీద్ అబ్దుల్ బాగి మహ్మద్ అల్‌బాద్ది, అహ్మద్ ఉస్మాన్, సలిహా అబ్దుల్లా, అనాస్ సిద్దిగి, ఒమర్ అబ్దుల్లాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 703 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.1.75కోట్లు ఉంటుంది. రెండో ముఠాలో సూడాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి 713 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2కోట్లు ఉంటుంది, స్వాధీనం చేసుకున్న ఫోన్లు ఎక్కువ ధరకు ఉన్నవి ఉన్నాయి.
.
జల్సాల కోసం…
మొబైల్ ఫోన్లను సూడాన్ దేశానికి చెందిన వారు చోరీ చేయకుండా ఇక్కడి స్థానిక ముఠాలను ఆశ్రయిస్తున్నారు. వారికి డబ్బులు ఆశచూపెట్టడడంతో చాలామంది చోరీ చేసిన తర్వాత వారికి విక్రయిస్తున్నారు. ఇలా మొబైల్ ఫోన్లు కొట్టేస్తున్న వారిలో చాలామంది జల్సాలకు డబ్బులు లేకపోవడంతో చోరీలు చేస్తున్నారు, కానీ వారికి ఈ అంతర్జాతీయ ముఠాల గురించి తెలియదు. వీరిని పోలీసులు అరెస్టు చేయడంతో అంతర్జాతీయ ముఠాల స్మగ్లింగ్ వ్యవహారం బయటికి వచ్చింది. గతంలో మొబైల్ ఫోన్ల చోరీ విషయాన్ని తేలికగా తీసుకున్న పోలీసులు అంతర్జాతీయ ముఠా దీని వెనుక ఉన్నట్లు తెలియడంతో నిఘా గట్టిగా పెట్టారు.

కేరాఫ్ సూడాన్….
మొబైల్ ఫోన్ల స్మగ్లింగ్ ముఠాల్లో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. ఆ దేశం నుంచి చదువుకోవడానికి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇక్కడ సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి ఇలాంటి ముఠాలతో చేతులు కలిపి మొబైల్ ఫోన్లను షిప్పుల ద్వారా తమ దేశానికి పంపిస్తున్నారు. కొంతమంది ఇక్కడి వచ్చి వ్యాపారం చేస్తున్నారు. కొందరు మొబైల్ ఫోన్ల రిపేర్, కొందరు దుస్తుల వ్యాపారులు ఉన్నారు. వీరందరు సులభంగా డబ్బులు సంపాదించేందుకు దీనిని మార్గంగా ఎంచుకున్నారు. చాలామంది నిందితుల వీసా గడువు ముగిసినా కూడా దేశంలో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News