న్యూఢిల్లీ: అపరేషన్ సిందూర్ తర్వాత భారత్పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత క్రీడాలోకం త్రివిధ దళాలకు మద్దతుగా నిలిచింది. దేశ ప్రజల సంరక్షణ కోసం శ్రమిస్తున్న భద్రత దళాలకు పలువురు క్రీడాకారులు మద్దతుగా నిలిచారు. సైన్యం సేవలను కొనియాడుతూ పలువురు స్టార్ క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. తామంతా సైన్యం వెంటే ఉన్నట్టు తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను సయితం లెక్క పెట్టకుండా సరిహద్దుల్లో పోరాడుతున్న మన సైనికులకు సెల్యూట్ అంటూ కోహ్లి పోస్ట్ చేశాడు.
క్లిష్ట సమయంలో అనుక్షణం దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైనికులకు అందరు మద్దతుగా నిలవాలని, వారిలో కొత్త ధైర్యాన్ని నింపాలని కోరాడు. దేశ సంరక్షణలో భాగంగా మన సైన్యం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మన దేశ గౌరవాన్ని పెంచడంలో సైనికులు ఎప్పుడూ ముందుంటారని వారి సేవలను కొనియాడాడు. మీ ధైర్యం, క్రమశిక్షణ, త్యాగమే జాతికి బలమని భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ వంటి పరిస్థితుల వేళ మన త్రివర్ణ పతకాన్ని ఎగురవేసిన మీ ధైర్యాన్ని, నిస్వార్ధ సేవలను ఎల్లవేళలా గుర్తుంచుకుంటామని సింధు తెలిపింది. వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, సౌరభ్ గంగూలీ, కైఫ్, అశ్విన్, యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్ తదితర క్రికెటర్లు సయితం సైనికులకు సెల్యూట్ చేస్తూ పోస్టులు పెట్టారు.