Wednesday, April 24, 2024

ప్రమాదపుటంచుల్లో శ్రీశైలం ప్రాజెక్టు !

- Advertisement -
- Advertisement -

డ్యాం భద్రతపై నిపుణుల ఆందోళన
భారీవరదల్లో నీటి మళ్లింపునకు ప్రత్యామ్నాయం
సమీపాన కొండను తొలిచి అదనపు స్పిల్‌వే ప్రతిపాదన
డ్యాం గేట్లు ఎత్తుపెంపుదలపై దృష్టి
తక్షణ రక్షణ చర్యలు అవశ్యం
సిడబ్యుసికి పాండ్యా కమిటి తుదినివేదిక
రేపు కృష్ణాబోర్డులో కీలక నిర్ణయం

Srisailam project in danger zone
మనతెలంగాణ/హైదరాబాద్:  దేశంలోనే అతిపెద్ద రెండవ జలవిద్యుత్ ప్రాజెక్టుగా పెరొంది..తెలుగురాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పడు ప్రమాదపుటంచుల్లోకి చేరుకుంది. కృష్ణానదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు పటిష్టతపై నిపుణులు ఆందోళనలు వెలిబుచ్చుతున్నారు. భారీ వరద నీటి వత్తిడిని సైతం తట్టుకుని నిలదొక్కుకున్న ఈ ప్రాజెక్టు పటిష్టతపట్ల ప్రభుత్వం తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డ్యాంకు పటిష్టతకు అవసరమైన చర్యలు తీసుకోవటంలో నిర్లక్షం చేసేకొద్ది తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదలు వచ్చిన నేపధ్యంలో స్పిల్‌వే ద్వారా ప్రస్తుతం ఉన్న నిటివిడుదల సామర్ధం దృష్టిలో ఉంచుకొని తగిన ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అమల్లోకి తేవాలని సూచిస్తున్నారు.

కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఎబి పాండ్య నేతృత్వంలో నియమించిన పదిమందితో కూడిన నిపుణుల కమిటీ ఈ ప్రాజెక్టు భధ్రతపైసమగ్ర అధ్యయనం నిర్వహించి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు పటిష్టతకు తక్షణం చర్యలు చేపట్టాని డిమండ్ చేస్తున్నారు. నివేదికలో సూచిన ప్రకారం భారీ వరదల సందర్బంలో ప్రస్తుతం ఉన్న స్పిల్‌వే ద్వారా దిగువకు నీటివిడుదలతోపాటు అదనంగా మరో స్పిల్‌వేను కూడా నిర్మించే ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అదే విధంగా భారీ వరదల సంర్బంగా జలాశయంలొకి చేరుతున్న వరదనీటి వత్తిడి నేరుగా డ్యాంపై పడి భద్రతకు ముప్పువాటిళ్లకుండా ఇతర మార్గాల ద్వారా వరదనీటిని మళ్చించే ప్రతిపాదనలను కూడా పరిశీలన చేయాలని సూచిస్తున్నారు. కృష్ణానదిలో వెయ్యేళ్ల గరిష్ట వరదనీటి ప్రవాహాలను పరిగణలోకి తీసుకోని 1961లో శ్రీశైలం ప్రాజెక్టును డిజైన్ చేశారు. నిర్మాణ దశలో పలు ఆటుపోట్లను తట్టుకొని 1981నాటకి ప్రారంభానికి నోచుకున్న ఈ ప్రాజెక్టు నాలుగు దశాబ్దాలు పూర్తిచేసుకుంది.

డ్యాం 12రేడియల్ క్రస్ట్ గేట్లతో 885అడుగుల స్థాయి గరిష్ట నీటి నిలువ సామర్దంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. కృష్ణానదిలో గరిష్ట వరద ప్రవాహాలను దృష్టిలో వుంచుకొని గేట్ల ద్వారా రిజర్వాయర్ నుంచి 13.20లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుల చేసేలా స్పిల్‌వేను నిర్మించారు. కేంద్ర జలసంఘం నిపుణుల అంచనాలు , కృష్ణాలో భారీవరదనీటి ప్రవాహాల అంచనాలు తలకిందులు చేస్తూ 2009లోనే కృష్ణమ్మ భారీ వరదలతో తనమహోగ్ర రూపాన్ని చూపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కృష్ణా, తుంగభద్ర పరివాహకంగా కేవలం 48గంటల వ్యవధిలోనే కురిసిన భారీ వర్షాలకు కర్నూలు , మహబూబ్ నగర జిల్లాల్లో జరిగిన ఆ నాటి వరద బీభత్స దృశ్యాలు ఇంకా ప్రజల కళ్లముందు కదులుతూనే ఉన్నాయి. కృష్ణానదిలో వరద నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకు సవాళ్లు విసిరింది. 25.5లక్షల క్యూసెక్కుల వరదనీటి వత్తిడితో ప్రాజెక్టుకు పరీక్ష పెట్టింది. ప్రాజెక్టు డ్యాం గేట్లపైన 896అడుగుల ఎత్తలో కృష్ణమ్మ స్పిల్‌వేనుంచి కిందకు సుడులు తిరుగుతూ మహోగ్ర రూపం ప్రదర్శించింది. డ్యాం నుంచి వెనక్కుమళ్లిన వరదనీరు తుంగభద్రలో పోటెత్తి కర్నూలు నగరాన్ని నీటముంచెత్తింది, ఇటు మహాబూబ్‌నగర్ జిల్లాలోనూ బీచుపల్లివద్ద కృష్ణమ్మ జాతీయ రహాదారిని మళ్లేసింది.

డ్యాం పటిష్టత తక్షణ అవసరం :

భారీ వర్షాలు వరదల వత్తిడితో దెబ్చతిన్న శ్రీశైలం డ్యాం భద్రతను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎబి ప్రాండ్య కమిటి ఇటీవల తన నివేదికన ప్రభుత్వానికి అందజేసింది. 2006లో వచ్చిన భారీవరద ప్రవాహంతోపాటు , 2009తో వచ్చిన రికార్డు స్థాయి వరద ప్రవాహాలను కూడా నివేదికలో పొందుపరించింది. డ్యాం పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి నివేదికలో పలు సూచనలు చేసింది. డ్యాం రేడియల్ గేట్ల ఎత్తును కొంత తగ్గించటం, గేట్ల స్థాయిని ఇప్పడున్న 892 అడుగుల స్థాయి నుంచి మరింత పెంచే అవకాశాలను పరిశీలించాలని తెలిపింది. ప్రస్తుతం ఉన్న స్సిల్‌వే 2009నాటి వరద ప్రవాహాల విడుదలకు ఏమాత్రం సరిపోదని స్పష్టమైంది. ఈ నేపధ్యంలో డ్యాంకు ఎగువన 5కి.మి వద్ద మరో స్పిల్‌వే నిర్మించాలని తెలిపింది. ఇందుకోసం కొండను తొలిచి 7.5కిమి పొడవున సొరంగ మార్గం నిర్మించాలని సూచించింది. ఈ సోరంగమార్గం ద్వారా పంపే వరదనీటిని డ్యాంకు దిగువన 9కి.మి వద్ద నదిలో వదిలే ప్రతిపాదనను పరిశీలించాలని తెలిపింది . అంతే కాకుండా అత్యవసర సమయాల్లో ఇటు తెలంగాణ వైపునుంచి నీటిని ప్రాజెక్టులకు మళ్లించుకోవటం, అటు ఏపి వైపు కూడా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ప్రాజెక్టులకు వరదను మళ్లించి ప్రధాన అనకట్టపై వరదనీటి ప్రవాహ వత్తిడిని తగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించింది.

కుడి ఎడమ గట్ల పటిష్టత:

శ్రీశైలం ఆనకట్టతోపాటు కుడి , ఎడమపైపు గట్లు కూడా దెబ్బతినకుండా వాటిని మరింత పటిష్టంగా రూపొందించాలని సూచించింది. డ్యాం 12రేడియల్ గేట్లు ఎత్తటం ద్వారా జలాశయంలోని నీరు ఎంతో వేగంగా గేట్ల నుంచి కిందకు దూకుతుంది. ఈ ప్రక్రియలో నీటి వత్తిడికి డ్యాం కూడా అక్కడక్కడా దెబ్బతింది. అంతే కాకుండా ఎంతో ఎత్తుపైనుంచి వరదనీరు వేంగంగా డ్యాం మీదుగా బకెట్ పోర్సన్‌లోపడి ఉవ్వేత్తున పైకిలేచి నురగలు కక్కుతూ ప్లంజ్‌పూల్‌లోకి పడుతుంది. ఈ ప్రక్రియలో ప్లంజ్‌పూల్ ప్రాంతలో నది గర్బం లోతైన గుంతుల పడిపోయింది. పదేళ్లకిందటే అండర్‌వాటర్ వీడియోగ్రఫీద్వారా ఈ గుంతల పరిమానం గుర్తించారు. అంతే కాకుండా ఈ ప్రాంతలో కోతవల్ల డ్యాం భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. ప్రధాన ఆనకట్ట అంతర్బాగంలో నిర్మించిన కుహరం, ,ఎగువభాగం నుంచి సూకా్ష్మతి సూక్ష్మమైన రంద్రాల ద్వారా నీటి లీకేజిలు , కుహరం నుంచి డ్రైనేజి సదుపాయం తదితర అంశాలపై కూడా తగిన జాగ్రత్తలు సూచించింది. డ్యాం రివర్స్‌బుల్ పంపింగ్ నిర్వహణ కూడా ఎప్పటికప్పుడు పటిష్టంగా ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలని తెలిపింది. సిడబ్యుసి మాజీ చైర్మన్ పాండ్యా శ్రీశైం ప్రాజెక్టు పటిష్టతపై అందజేసిన నివేదిక కూడా ఈ నెల 6న జరిగే కృష్ణానదీయాజమాన్యబోర్డు సమావేశంలో చర్చకు రానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News