Saturday, April 27, 2024

వైభవంగా శ్రీవారి రథోత్సవం

- Advertisement -
- Advertisement -

భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు
గోవిందనామస్మరణతో మారుమోగిన మాడవీధులు

మన తెలంగాణ / హైదరాబాద్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన సోమవారం.. ఉదయం 6.55 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారిరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. అనాది కాలం నుండి రాజులకు రథ సంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథ సంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది.

తిరుమలలోరథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైంది. ‘‘రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే” అన్న ఆర్ష వాక్కులు రథోత్సవంమోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథ రూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది.

రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద చిన్నజీయర్ స్వామి, చిన్న జియర్ స్వామి, టిటిడి ఛైర్మన్ భూమాన కరుణాకర్‌రెడ్డి దంపతులు, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Mada Veedhilo

 

 

్ల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News