Monday, May 6, 2024

ఎన్నికలను మేం నియంత్రించలేం

- Advertisement -
- Advertisement -

వీవీప్యాట్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో100 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని వెల్లడించింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీ ప్యాట్ స్లిప్పులను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం మరోసారి విచారణ జరిపింది. వాస్తవానికి దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించాల్సి ఉంది.

అయితే ఈ అంశంలో ఇంకా తమకు సందేహాలు ఉండటంతో ధర్మాసనం స్పష్టత కోరింది. ఈ క్రమం లోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది. కంట్రోలింగ్ యూనిట్ లోనా లేదా వీవీ ప్యాట్ లోనే ? అని ప్రశ్నించింది. మైక్రో కంట్రోలర్ అనేది ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా , కాదా ?అన్నది నిర్ధారించాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నం ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఎన్నికల సంఘం వివరణను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. “ మా సందేహాలను ఈసీ నివృత్తి చేసింది. మీ (పిటిషనర్ ) ఆలోచనా ధోరణిని మేం మార్చలేం. కేవలం అనుమానాలను ఆధారం చేసుకుని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేం.

ఎన్నికల సంఘం ఓ రాజ్యాంగ సంస్థ . దాని తీరును మేం నిర్దేశించలేం. ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేం.” అని స్పష్టం చేసింది. ఈ విచారణ సందర్భంగా ఈవీఎం సోర్స్ కోడ్‌కు సంబంధించిన అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు. పారదర్శకత కోసం దాన్ని బయటపెట్టాలని కోరారు. దీన్ని ధర్మాసనం వ్యతిరేకించింది. “ సోర్స్ కోడ్‌ను ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు. ఇలా చేస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది ” అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంల లోని ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News