Thursday, May 2, 2024

చట్టసభల్లో అవినీతి… 1998 నాటి తీర్పు పునఃపరిశీలిస్తామన్న సుప్రీం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్, శాసనసభల్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారించే విషయంపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఎంపీలు, ఎమ్‌ఎల్‌ఎలకు విచారణ నుంచి మినహాయింపునిస్తూ 1998లో ఇచ్చిన తీర్పును పునః పరిశీలించేందుకు అంగీకరించింది. దీనికోసం ఏడుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యురాలు సీతా సోరెన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకుని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఈ క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించడంతో సీతాసోరెన్ సుప్రీంకు వెళ్లారు. ఎంపీలు, ఎమ్‌ఎల్‌ఎలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా? లేదా వారికి రక్షణ ఉంటుందా ? అనే అంశాన్ని 2019 లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసుకు ఎంతో ప్రాముఖ్యత ఉందంటూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. తాజా ఆ కేసును పరిశీలించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం … సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పీవీ సరసింహారావు వర్సెస్ సీబీఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలిస్తామని తెలిపింది. ఇందుకోసం ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News