Sunday, April 28, 2024

మహిళా ఉద్యోగి తొలగింపు.. రూ. 60 లక్షలు చెల్లించాలని సుప్రీం ఆదేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సైన్యంలో నర్సుగా పనిచేసిన ఓ మహిళను వివాహం తరువాత తొలగించడం వివక్షాపూరితమైనదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమెకు రూ.60 లక్షల బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లింగ వివక్ష చూపే ఏ చట్టాన్ని రాజ్యాంగం అనుమతించబోదని స్పష్టం చేసింది. సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో ఉండే సెలినా జాన్ అనే నర్సును వివాహం తరువాత 1988లో విధుల నుంచి తొలగించడంతో ఆమె అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మొదట ట్రైబ్యునల్‌కు వెళ్లమని న్యాయస్థానం సూచించగా, ఆమె సాయుధ దళాల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. తిరిగి విధుల్లోకి ఆమెను తీసుకోవాలని ట్రైబ్యునల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో కేంద్రం సవాలు చేసింది.

ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ట్రైబ్యునల్ తీర్పులో ఎలాంటి జోక్యం అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. వివాహ కారణాలతో మిలిటరీ నర్సింగ్ సర్వీస్ నుంచి తొలగించేందుకు అనుమతించే నిబంధనను 1995 లో ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. బాధితురాలు ప్రైవేట్‌గా కొంతకాలం నర్స్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవరించింది. ఆమెకు బకాయిల రూపంలో రూ. 60 లక్షలు చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలు అందిన ఎనిమిది వారాల్లోగా ప్రభుత్వం ఈ చెల్లింపులు చేయాలని ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News