Thursday, March 28, 2024

మరో సిరీస్‌కు సిద్ధమైన టీమిండియా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: కొంతకాలంగా టీమిండియా ఎడతెరిపి లేకుండా క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. స్వల్ప వ్యవధిలోనే రెండు టి20 ప్రపంచకప్‌లు, ఆసియాకప్‌లతో సహా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర జట్లతో భారత్ తలపడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ గడ్డపై భారత్ పర్యటించింది. ఇక్కడ మూడు టి20లు, మరో 3 వన్డేల సిరీస్ ఆడింది. అయితే ఈ సిరీస్‌లో సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రాహుల్, షమి, అశ్విన్ తదితరులకు విశ్రాంతి ఇచ్చారు. అయితే బంగ్లాదేశ్ గడ్డపై జరిగే సిరీస్‌లో మాత్రం సీనియర్లు తిరిగి జట్టులో చేరనున్నారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు.

ఆదివారం నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. రెండో వన్డే డిసెంబర్ ఏడు, మూడో, చివరి వన్డే 10న జరుగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత్ రెండు మ్యాచులు ఆడనుంది. తొలి టెస్టు డిసెంబర్ 14 నుంచి, రెండో టెస్టు డిసెంబర్ 22 నుంచి జరుగుతుంది. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్ భారత్‌కు కీలకంగా మారింది. వరల్డ్‌కప్ నాటికి మెరుగైన జట్టును తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో భారత క్రికెట్ బోర్డు ఉంది. దీని కోసం పలువురు యువ ఆటగాళ్లకు ఇప్పటికే అవకాశాలు కల్పించింది. అయితే బంగ్లాదేశ్ సిరీస్‌లో మాత్రం సీనియర్లను ఆడించాలని నిర్ణయించింది. ఈ సిరీస్‌లో రోహిత్‌తో పాటు రాహుల్, కోహ్లి, షమి, శిఖర్ ధావన్, జడేజా తదితరులు బరిలోకి దిగుతున్నారు.

ఇక యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, రజత్ పటిదార్, యశ్ దయాళ్ తదితరులకు స్థానం కల్పించింది. అయితే సంజు శాంసన్, అశ్విన్‌లకు వన్డే సిరీస్‌లో స్థానం లభించలేదు. అశ్విన్ వన్డే సిరీస్‌కే పరిమితమయ్యాడు. శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జడేజా,రిషబ్, శ్రేయస్ అయ్యర్, షమి, సిరాజ్ తదితరులు రెండు సిరీస్‌లలో కూడా చోటు దక్కించుకున్నారు. మరోవైపు పూర్తి ఫిట్‌నెస్ సాధించని సీనియర్ బౌలర్ బుమ్రాను సిరీస్‌కు ఎంపిక చేయలేదు. కాగా, శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారాలకు టెస్టు జట్టులో స్థానం లభించింది. ఉమేశ్ యాదవ్ కూడా జట్టుకు ఎంపికయ్యాడు. రెండో వికెట్ కీపర్‌గా కెఎస్.భరత్‌కు చోటు కల్పించారు.

తక్కువ అంచనా వేయలేం..

మరోవైపు బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. సొంత గడ్డపై బంగ్లాదేశ్ ఎప్పుడైనా ప్రమాదకర జట్టే. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసే ఆటగాళ్లకు ఆ జట్టులో కొదవలేదు. షకిబ్, మహ్మదుల్లా, నజ్ముల్, లిటన్ దాస్, ముష్ఫికుర్ రహీం, ముస్తాఫిజుర్, మెహదీ హసన్, అనముల్ హక్ తదితరులతో బంగ్లాదేశ్ బలంగా ఉంది. దీంతో ఈ సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News