Sunday, April 28, 2024

విలువలను దెబ్బతీసే టెక్నాలజీ అవసరమా? సముచితమా

- Advertisement -
- Advertisement -

సోషల్ మీడియా, ఎఐ నియంత్రణ, విశృంఖలత మన చేతుల్లోనే
ఐఐటి మద్రాసు 60వ స్నాతకోత్సవంలో సిజెఐ చంద్రచూడ్
ఆవిష్కరణలకు డబ్బు కొలమానం కారాదు
నేటి యువత రేపటి తరంకోసం ఆలోచించాలి

చెన్నై : సాంకేతికత, సామాజిక మాధ్యమాలు, కృత్రిమ మేధను హానికర ప్రయోజనాలకు వాడరాదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తెలిపారు. సమాజంలో మానవీయ విలువలు, న్యాయం అన్నింటి కన్నా ప్రధానమని స్పష్టం చేశారు. ఐఐటి మద్రాసు 60వ స్నాతకోత్సవ సభకు శనివారం ఆయన అతిధిగా హాజరయ్యి ప్రసంగించారు. ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ, సామాజిక మాధ్యమాల ప్రభావం తీవ్రంగా ఉంటోంది.

అన్ని రంగాలకు ఇది విస్తరించుకుని అల్లుకుని పోతోంది. సాంకేతిక పరిజ్ఞానంతో త్వరితగతిన విస్తృత స్థాయిలో ఎటువంటి సమాచారం అయినా క్షణాల్లో వ్యాపిస్తోంది. ఈ దశలో ఈ టెక్నాలజీ సంబంధిత వినూత్న బహుళ ప్రచార వేదికలు దుర్వినియోగం కారాదని సిజెఐ పిలుపు నిచ్చారు. మానవీయ విలువలు, న్యాయ ప్రక్రియకు విఘాతం కల్పించే ఎటువంటి సాంకేతికత అయినా సమాజానికి కీడు కల్గిస్తుందన్నారు. ప్రత్యేకించి వ్యక్తిగత గోప్యత కీలక విషయం. ఇది విలువలకు సంబంధించిన అంశం, ఇందులోనే న్యాయం ఇమిడి ఉంటుందని, వీటికి విఘాతం కల్గితే దీనికి కారణమైన ఎటువంటి ప్రక్రియ అయినా అనుచితమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

అందుబాటులోకి వచ్చే నూతన సాంకేతిక పరిజ్ఞానం మనం సృష్టించుకున్న ఆయుధమే. ఇదేదో అమాంతం గాలిలో నుంచి పుట్టుకుని రాదు. ఈ క్రమంలో దీనిని సరైన రీతిలో వాడుకునేందుకు అనువుగా సరైన జాగ్రత్తలు కూడా తీసుకోవల్సి ఉంటుంది. లేకపోతే ఈ స్వయం సృష్టి ఆయుధం మననే దెబ్బతీస్తుందని హెచ్చరించారు. సాంకేతిక పరిజ్ఞానపు విస్తృతక్రమంలో ఇప్పుడు మన ముందుకు సృష్టికి ప్రతిసృష్టి తరహాలో కృత్రిమ మేధ కూడా దూసుకువచ్చింది. ఇది ఏ మేరకు మనకు మేలు చేస్తుంది? కీడు తలపెడుతుందనేది దీనిని సృష్టించుకుని, వాడుకునే మన చేతుల్లోనే ఉంటుందని సిజెఐ స్పష్టం చేశారు. శూన్యంలో నుంచి ఏది ఆవిర్భవించదు. ఏదో ఒక ప్రాతిపదికన ఆవిష్కృతం అయ్యే ప్రక్రియలు సరైన విధంగా పనికిరావడం అనేది మన ఆలోచనల పరిపక్వతను బట్టి ఉంటుందని తెలిపారు. సాంకేతికతను విశ్వసనీయ రీతిలో వాడుకోవల్సి ఉంటుంది. దీని వాడకంతో వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీసే దుష్పరిణామాలు ఏమీ తలెత్తకూడదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News