Friday, April 26, 2024

600 చదరపు గజాల భవనాలకు కూల్‌ రూఫ్‌ తప్పనిసరి: మంత్రి కెటిఆర్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ‘కూల్‌ రూఫ్‌ పాలసీ’ని తీసుకొస్తున్నామని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. ఇది భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమన్నారు. మొదట తమ ఇంటిపై కూల్‌ రూఫ్‌ విధానం అమలుచేశామన్నారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని సిడిఎంఏ ఆఫీస్‌లో భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీ 2023-28ని మంత్రి కెటిఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశం మొత్తంలోనే హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు దేశంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. టిఎస్‌ బీపాస్‌తో దేశంలో ఎక్కడాలేని విధంగా భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని చెప్పారు.

ఈ ఏడాది హైదరాబాద్‌లో 5 చదరపు కిలోమీటర్ల కూల్‌ రూఫ్‌ అమలుచేస్తామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లన్నిటిపై కూల్‌ రూఫ్‌ అమలు చేస్తామన్నారు. 2030 నాటికి రాష్ట్రంలో 200 చదరపు కిలోమీటర్ల కూల్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు కూల్‌ రూఫ్‌ ఏర్పాటును తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. కూల్‌రూఫ్‌ వల్ల మీటరుకు రూ.300 మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు.

కూల్‌రూఫ్‌ పెయింట్‌ వేయడం వల్ల కరెంటు చార్జీలు ఆదా అవుతాయని చెప్పారు. ఇప్పటికే కట్టిన భవనాలపై కూడా కూల్‌రూఫ్‌ విధానం అమలుచేయొచ్చని వెల్లడించారు. ఈ పాలసీలో భాగంగా రాష్ట్రంలో కూల్‌రూఫ్‌ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని, అనుసరించేవారికి ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు.

Telangana Policy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News