Monday, April 29, 2024

తెలంగాణ ఫుడ్స్‌లో రూ. 42.80 కోట్లతో ఎక్స్ ట్రూడర్ ప్లాంట్

- Advertisement -
- Advertisement -

ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్
చిన్నారుల పౌష్టికాహారానికి నూతన టెక్నాలజీ వినియోగం

మన తెలంగాణ / హైదరాబాద్ : చిన్నారులకు అందించే పౌష్టికాహారం కోసం రూ.42.80 కోట్లతో ఎక్స్ ట్రూడర్ ప్లాంట్‌ను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంబించారు. తెలంగాణ ఫుడ్స్ సంస్థలో నూతన టెక్నాలజీతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్లాంట్ ద్వారా గంటకు నాలుగు మెట్రిక్ టన్నుల స్నాక్ ఫుడ్ సరఫరా జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నెలకు 300 మెట్రిక్ టన్నుల స్నాక్ ఫుడ్ అవసరం ఉండగా కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 100 మెట్రిక్ టన్నుల స్నాక్ ఫుడ్‌ను నూతన ఎక్స్ ట్రూడర్ ద్వారా తయారు చేయవచ్చన్నారు. ఇది అసియాలోనే అతి పెద్ద ప్లాంట్ అని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 37,200 అంగన్‌వాడీలకు టిఎస్ ఫుడ్‌లో తయారవుతున్న బాలామృతం, బాలామృతం ప్లస్ అందించడం ద్వారా రాష్ట్రంలోని చిన్నారులకు, గర్భిణీల్లో రక్తహీనత, మాల్ న్యూట్రీషన్‌ను అధిగమించడం జరిగిందని తెలిపారు. దీని వల్ల మాతా, శిశు మరణాల రేటు పూర్తిగా తగ్గిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ న్యూట్రిషన్ ఫుడ్ దేశవ్యాప్తంగా అమలు కావాలని భారత ప్రభుత్వం అభిలషిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పళాలు దేశవ్యాప్తంగా అమలు కావడం కోసం బిఆర్‌ఎస్ పార్టీని ప్రారంభించడం జరిగిందని వివరించారు. 75 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం సాధించిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. దేశంలో ఉండే సందపను సరైన రీతిలో ఉపయోగించి దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన అని, అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆరాటపడే వ్యక్తి కెసిఆర్ అని పేర్కొన్నారు. నేడు దేశం మొత్తం కెసిఆర్ పాలన కోరుకుంటోందని మంత్రి వివరించారు.

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీలను బలహీన పరుచాలనే వ్యూహాలతో ముందుకు వెళ్తోందన్నారు. సిబిఐ, ఈడి దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకొని అమాయకులపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలకు అమలు అవుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలనేది ముఖ్యమంత్రి లక్షమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కాలంలో రాష్ట్రానికి కేంద్రం వాటా 80 శాతం ఉండగా రాష్ట్ర వాటా 20 శాతం ఉండేదన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కేంద్రం 20 శాతం ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం ఇస్తోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి సురభీ వాణి దేవి, ఎంఎల్‌ఎ భేతి సుభాష్ రెడ్డి, మేయర్ కావ్య, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, శాంతి, బన్నాల గీత, టిఎస్‌ఫుడ్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, జిఎం విజయలక్ష్మి, కృష్ణవేణి, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News