Sunday, April 28, 2024

ఉచిత శిక్షణతోపాటు స్టైఫండ్…

- Advertisement -
- Advertisement -

Stipend with free training for BC students

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే 80,039 ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్లకు వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ శాఖ సకల సన్నాహాలు చేసింది. దాదాపు 50 కోట్ల రూపాయల ఖర్చుతో బీసీ స్టడీ సర్కిళ్లు, సెంటర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 1,25,000 మందికిపైగా ఉచిత కోచింగ్ నిర్వహిస్తాం. నేడు మాసాబ్ టాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో బీసీ సంక్షేమశాఖ ప్రిన్షిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు, అన్ అకాడమీ ప్రతినిధులతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

టీఎస్సీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1,2,3,4 తో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకం చేసే పోలీస్ కానిస్టేబుల్, వివిద రకాల ఎస్సై ఉద్యోగాలు, వ్యవసాయ శాఖ, వైద్యశాఖ ఇతర శాఖలు నిర్వహించే పోస్టుల వారీగా కోచింగ్ సదుపాయాన్ని అందజేస్తాం. బీసీ సంక్షేమ శాఖ రాష్ట్రంలో నిర్వహిస్తున్న 11 స్టడీసర్కిళ్లతో పాటు మంజూరైన మరో ఐదు స్టడీ సర్కిళ్లు సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి, నర్సంపేట్, జగిత్యాలలో కూడా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా కోచింగ్ని అందజేస్తాం, అదే విదంగా స్టడీ సర్కిళ్లు లేని ప్రతీ నియోజకవర్గంలో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తాం.

నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒక రీడింగ్ రూమ్, ఆన్లైన్ క్లాస్ రూం, డౌట్ క్లియరెన్స్ రూం ఇలా మూడు రూములతో కూడిన 103 స్టడీ సెంటర్లను త్వరలో ఏర్పాటు చేస్తాం. ఉచితంగా మౌలిక వసతుల కల్పన, ఇతర ఏర్పాట్లు ఎవరైనా ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ఏర్పాటు చేస్తే అక్కడ సైతం బీసీ స్టడీ సెంటర్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, వీటి ద్వారా కోచింగ్ తో పాటు నాణ్యమైన స్టడీ మెటీరియల్ని అభ్యర్థులకు అందజేస్తాం. 16 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 25,000 మందికి నేరుగా, మరో 50,000 వేల మందికి హైబ్రిడ్ మాడల్లో ఆన్లైన్, ఆప్లైన్ మోడ్లో శిక్షణ ఇస్తాం, అలాగే 103 బీసీ స్టడీ సెంటర్ల ద్వారా ఒక్కో దాంట్లో 500 మందికి తగ్గకుండా మరో 50, 000 మందికి మొత్తంగా 1,25,000 మందికి నాణ్యమైన శిక్షణ అందిస్తాం, ఇందుకోసం ప్రతిష్టాత్మక ఆన్ అకాడమీతో కొలాబరేషన్ కుదుర్చుకోవడం జరిగింది.

బీసీ సంక్షేమ శాఖ అందించే కోచింగ్ లో రిజర్వేషన్లు బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, ఈబీసీలకు 5 శాతం, మరో ఐదు శాతం మైనారిటీలకు కేటాయిస్తాం. బీసీ సంక్షేమ శాఖ అందించే ఉద్యోగార్థుల శిక్షణ కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తక్షణమే ప్రారంభిస్తాం, ఆన్ అకాడమీ ద్వారా నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ కు నేటి నుండి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 16 వ తారీఖున ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో పరీక్ష ఉంటుందని 10 గంటల వరకు కూడా పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. డెస్క్టాప్, ల్యాప్టాప్ లతోపాటు మొబైల్ ఫోన్ల ద్వారా పరీక్ష రాసే సౌకర్యం కల్పిస్తాం. 90 నిమిషాల పాటు నిర్వహించే ఈ పరీక్షలో సామర్థ్యం ప్రకారం ఐదు విభాగాలుంటాయి, మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తాం. నెగటివ్ మార్కులు ఉండే ఈ పరీక్షలో కాపీ కొట్టడం, చూచి రాయడానికి వీలులేకుండా టైం వుంటుంది, పరీక్షలో అభ్యర్థులకు ఆయా విభాగాల్లో వచ్చిన మార్కుల ప్రకారం ఏ కోర్సులకు ఎన్నికవుతారు అనేది నిర్ణయించి తెలియజేస్తాం.

గ్రూప్ 1 పరీక్ష కోసం ప్రిలిమ్స్, మెయిన్ కలిపి ఆరు నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుంది, దాదాపు పది వేల మంది అభ్యర్థులకు అందించే ఈ శిక్షణలో నెలకు ఐదు వేల చొప్పున ఆరు నెలలపాటు స్టైపెండ్ని సైతం అందిస్తాం. గ్రూప్ 2, ఎస్ఐ ఉద్యోగాల కోసం శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు కోచింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికీ నెలకు రెండు వేల చొప్పున మూడు నెలలపాటు అందిస్తాం. ఈ నెల 16న నిర్వహించే ఆన్లైన్ పరీక్ష ఫలితాల్ని సైతం అదే రోజు మధ్యాహ్నం నుండి తెలియజేస్తాం, ఆ తర్వాత ఈనెల 20 లేదా 21 నుండి కోచింగ్ క్లాస్సెస్ ప్రారంభమవుతాయి. వేల రూపాయలు ఖర్చు చేసే ఈ శిక్షణ బీసీ వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది దీన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని బీసీ యువతను కోరుతున్నాను. ఈ మెకానిజం కోసం అయ్యే టెక్నాలజీ మొత్తం సిఎస్ఆర్ ఫండ్ కింద అన్ అకాడమీ సొంతంగా భరిస్తుంది వారి ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహిస్తాం.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన అన్ అకాడమీ ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వంతో పేద వెనకబడిన అభ్యర్థుల కోసం ఇచ్చే కోచింగ్ లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు, తెలంగాణ ప్రభుత్వం అందించే స్టైఫండ్ తో పాటు కొంతమంది మెరిట్ అభ్యర్థులకు తాము సైతం 20వేల విలువ చేసే తమ స్టడీ మెటిరియల్ని స్టైపెండ్ రూపంలో అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం జె పి స్కూల్ సెక్రటరీ మల్లయ్య బట్టు గారు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ గారు, ఇతర బీసీ సంక్షేమ శాఖ అధికారులు అన్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News