Sunday, April 28, 2024

కాలుష్యంతోనే ఉష్ణోగ్రతలు

- Advertisement -
- Advertisement -

మార్చి మొదలైందో లేదో అప్పుడే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో మనుషులే కాదు మూగ జీవాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. పలు చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత బయట అడుగుపెట్టేందుకు జంకుతున్నారు. సాయంత్రం ఎండ తీవ్రత తగ్గిన తర్వాత బయటకు వస్తున్నారు.మిగతా సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. గతేడాది మార్చి నెలతో పోల్చితే ఈ ఏడాది ఇదే నెలలో ఎండలు పెరగనున్నాయి. గతేడాది మార్చి నెలలో 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈసారి పెరిగే అవకాశం వుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులకు వెళ్లేవారు తెల్లవారుజామున పనికి వెళ్తున్నారు. ఉపాధి పనికి కూడా ఉదయాన్నే వెళ్తున్నారు.పేద, మధ్యతరగతి ప్రజలు అటకెక్కించిన కూలర్లను కిందికి దించుతున్నారు. కొందరు కూలర్లు కొనేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు ఎసిలు, ఫ్యాన్లు, కూలర్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. మధ్యాహ్నం కూల్‌డ్రింక్ షాపులు, చెరుకురసం, పళ్ల రసాలు, కొబ్బరి బోండాల దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తున్నది.

ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానియాలను ఆశ్రయిస్తున్నారు. ఎండకు తాళలేక చిరువ్యాపారులు మధ్యాహ్నం కాకముందే ఇళ్లకు చేరుకుంటున్నారు. మార్చిలోనే ఇంత ఉక్కపోతగా ఉంటే మరి ఏప్రిల్, మే నెలలో మన పరిస్థితి ఏంటి?ఈ విధంగా రోజు రోజుకు వడగాళ్లు పెరగడానికి కారణం ఏమిటి అని పరిశీలిస్తే భూమిపై రోజురోజుకు అనేక మార్పులు సంభవిస్తున్నాయి.మన దేశం సమశీతోష్ణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. దానికి కారణం పర్యావరణ కాలుష్యం. భూమిపై వివిధ రకాల జీవులు, అవి ఏర్పరచుకునే సహజ నమూనాలు ప్రపంచ పర్యావరణం పని చేయడానికి సహాయపడతాయి. కలుషితమైన గాలి, నీరు, క్షీణించిన నేల, పట్టణ పెరుగుదల అన్నీ కూడా పర్యావరణంపై ప్రభావం చూపిస్తాయి. వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువులు, అతినీలాలోహిత కిరణాలు, ఏరో సాల్స్, ఓజోన్లలో దీర్ఘకాలిక మార్పులను పర్యవేక్షించడం వలన వాతావరణ మార్పులు కనబడుతున్నాయి. తీవ్రమైన వేడి, పొడి గాలుల కారణంగా సంభవించే అడవి మంటలు, సముద్రపు ఆమ్లీకరణ, వేడెక్కడం వల్ల బ్లీచ్డ్ పగడాలు, తుఫానులు, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా, తీరప్రాంత వరదలు, ఎడారి కరణ కారణంగా వాతావరణంలో మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

దీని ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలో పెరుగుదల, అలాగే సముద్ర ఉష్ణోగ్రతలు ఎక్కువ లోతులలో పెరగడం, తరచుగా సముద్రపు వేడి తరంగాలు, పిహెచ్ విలువ తగ్గడం, సముద్రం వేడెక్కడం, మంచు పలకలు ద్రవీకరణ చెందడం ఇవన్నీ కూడా పర్యావరణ మార్పుల వల్ల వస్తున్నాయి. రానున్న రోజులలో మన దేశం తీవ్రమైన వడగాల్పులతో ఇబ్బందిపడుతుందని వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వాల సంఘం నివేదిక గత సంవత్సరం హెచ్చరించింది. తాజాగా ప్రపంచ బ్యాంకు సైతం ఇదే విషయంపై అనేక ఆందోళనకర విషయాలను తెలిపింది. వేడిగాలుల వల్ల భారత దేశంలోని ప్రజల ఆయుష్షు తగ్గి, పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని తెలిపింది. గత సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ నెలలో 46డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైతే ఈ సంవత్సరం ఎండా కాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 1981-1990 మధ్యకాలంలో 413 రోజులు, 2011- 2020 మధ్యకాలంలో 600 రోజులు తీవ్రవడగాల్పులు వీచాయని భారత పర్యావరణ విభాగం వెల్లడించింది. అనగా 1990 నుండి 2019లో భారత్‌లో వడగాల్పుల తీవ్రత 15% పెరిగినట్లు లాన్సెట్ నివేదిక తెలిపింది.ఈ విధంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వడగాలులు వీచి వాటి ప్రభావం అనేక వాటిపై కనిపిస్తుంది.

రైతులు, వివిధ కార్యాలయాల్లో సిబ్బంది పనిచేయలేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల భూమిపై ఉన్న జీవులపై కూడా ప్రభావం చూపుతుంది. కోళ్లపెంపకం, గొర్రెలు, మేకల పెంపకం, చెరువులో పెంచే చేపల పెంపకంలో అనుకున్న స్థాయిలో కన్నా దిగుబడి తగ్గుతుంది.ఇవేకాక పాలిచ్చే జంతువులైన ఆవులు, గేదెల్లో కూడా పాల దిగుబడి తగ్గుతుంది. ఉష్ణ తాపం రవాణా వ్యవస్థపై కూడా ప్రభావం చూపి, ఆహార ధాన్యాల రేట్లు పెరిగి, ప్రజలకు భారమవుతుంది. ఆహార ధాన్యాల నిలువల కోసం, వాటిని శీతలీకరణ గిడ్డంగుల్లో ఉంచడానికి, వాటిని చల్లపరచడానికి ఎసిలు, కూలర్లు, ఫ్యాన్లు అవసరమవుతాయి.తద్వారా కరెంటు బిల్లు కూడా అధికంగా వచ్చి నష్టపోయే అవకాశం వుంది. పర్యావరణంలో ఉష్ణోగ్రతల తగ్గుదల కోసం అనేక చర్యలు చేపట్టాలి. చెట్లను అధికంగా నాటడం, వాటిని రక్షించడం ద్వారా కొంతమేర ఉష్ణోగ్రతను అరికట్టవచ్చు.

ఒక్కొక్క గృహానికి అనేక వాహనాలు వాడడం, ఎసి, రిఫ్రిజిరేటర్లు వాడడం వల్ల, మొబైల్ వాడటం, వాటి టవర్ల నుండి వచ్చే రేడియేషన్ ద్వారా, ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్ధాలను కాల్చడం ద్వారా, వాతావరణం కలుషితమై భూమిపై కార్బన్‌డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా విడుదలై ఓజోన్‌పై ప్రభావం చూపి, భూమిపై ఉష్ణోగ్రత, వడగాలులు పెరుగుతాయి. వీటిని అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసినట్లయితే భూమిపై ఉష్ణతాపాన్ని అరికట్టవచ్చు. క్షీణించిన నేల, పట్టణ పెరుగుదల అన్నీ కూడా పర్యావరణంపై ప్రభావం చూపిస్తాయి. వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువులు, అతినీలలోహిత కిరణాలు, ఏరోసాల్స్, ఓజోన్లలో దీర్ఘకాలిక మార్పులను పర్యవేక్షించడం వలన వాతావరణ మార్పులు కనబడుతున్నాయి. వేసవిలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ఉష్ణోగ్రతలకు అనుగుణంగా నీరు తాగాలి. ముఖ్యంగా బిపి, మధుమేహ బాధితులు జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్కరూ రోజుకు ఆరు లీటర్ల నీరు తాగాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఎండ తీవ్రత ఉన్నప్పుడు బయటకు రాకూడదు. డీహైడ్రేషన్, విరేచనాలు అయితే నీటిలో ఒఆర్‌ఎస్ పొడి కలిపి తాగాలి. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News