Friday, May 3, 2024

భారత్‌కు అదెంతో గర్వకారణం…శశిథరూర్ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సదస్సుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ‘ ఢిల్లీ డిక్లరేషన్ పై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడంలో భారత్ చేసిన కృషిని కొనియాడారు. ఇది భారత్‌కు ఎంతో గర్వకారణమన్న ఆయన, మనదేశం తరఫున షెర్పాగా ఉన్న అమితాబ్ కాంత్ పాత్రను అభినందించారు. శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ్యదేశాలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో శశిథరూర్ ఈ విధంగా స్పందించారు. ఉక్రెయిన్ రష్యా సంక్షోభం విషయంలో ‘ఢిల్లీ డిక్లరేషన్ ’ తీర్మానంలో భారత్ పేర్కొన్న ‘పేరా’కు సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి. అయితే ఈ ఏకాభిప్రాయం ఎలా సాధ్యమైందనే విషయాన్ని భారత్ షెర్పాగా వ్యవహరించిన అమితాబ్ కాంత్ ఓ ఇంటర్వూలో వివరించారు.

ఎక్స్(ట్విటర్) ఖాతాలో ఈ కథనాన్ని ట్యాగ్ చేసిన థరూర్… “అమితాబ్ కాంత్ ….బాగా పనిచేశారు. మీరు ఐఎఎస్ ఎంచుకున్నప్పుడు … ఐఎఫ్‌ఎస్ దూకుడైన దౌత్యవేత్తను కోల్పోయింది. రష్యా, చైనాతో జరిపిన చర్చల అనంతరం ఢిల్లీ డిక్లరేషన్‌పై ఓ ముసాయిదాను రూపొందించినట్టు చెప్పారు. జీ 20 సదస్సులో నిజంగా ఇది భారత్‌కు ఎంతో గర్వకారణం ’ అని శశిథరూర్ పేర్కొన్నారు. పలు అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలగడం భారత్‌కు అతిపెద్ద విజయంగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం అంశంలో తలెత్తిన పీటముడిని చాకచక్యంగా పరిష్కరించగలిగిందని పేర్కొంటున్నారు. సంయుక్త ప్రకటనలో సంబంధిత పేరాను సవరించడం ద్వారా అన్నిదేశాల మద్దతును భారత్ సాధించిందని చెబుతున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ ఏకాభిప్రాయం పై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రకటనతో అగ్రదేశాల నుంచి భారత్‌పై ప్రశంసలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News