Wednesday, April 24, 2024

రాహుల్‌కు కొత్త ఇమేజి ఇచ్చిన గడ్డం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా సాగించిన సుదీర్ఘ పాదయాత్ర ఆయనకు రాజకీయంగా ఏమయినా లాభించిందా అనే విషయమై పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి. యాత్రకు ముందు ఉన్న ఇమేజి, యాత్ర ముగిసే సమయానికి పెరిగిన గుబురు గడ్డంతో కాస్త వయసు మళ్లిన వ్యక్తిగా కనిపిస్తున్న ఇమేజి ఈ రెండింటి తేడా తప్ప రాజకీయంగా ఆయన సాధించింది ఏమీ లేదని వాదించే వారు చాలా మందే ఉన్నారు. ఇక రాజకీయ ప్రత్యర్థులయితే ఆయనను‘ పప్పూ’గా అభివర్ణిస్తూ అపరిపక్వ నేతగా ఇప్పటికీ తేలిగ్గా కొట్టి పారేసే వాళ్లూ లేకపోలేదు. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే రోజుకు 20 -25కిలోమీటర్ల చొప్పున 135 రోజుల పాటు వివిధ రాష్ట్రాలగుండా సాగిన ఈ యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్‌ను తప్పకుండా పెంచి తీరుతుందని మీడియా వర్గాలు అంటున్నాయి. రాహుల్ గాంధీ గడ్డం పెంచడాన్ని సైతం బిజెపి నేతలు విమర్శించారు. ఆయనను సద్దాం హుస్సేన్‌తోను, కారల్ మార్క్‌తోను పోల్చిన వాళ్లూ ఉన్నారు. అయితే తెలుపు నలుపు కలనేతలాగా సగం తెల్లవెంట్రుకలు, సగం నల్ల వెంట్రుకలతో ఉన్న గడ్డం రాహుల్‌కు ఓ కొత్త ఇమేజినైతే తెచ్చిపెట్టిందనే చెప్పాలి.

యాత్ర సందర్భంగా తాను ఎంతో నేర్చుకున్నానని రాహుల్ చెప్పిన మాట నిజమే అయితే రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో ఆయనొక బలమైన నేతగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఉన్న ‘పప్పూ’ ఇమేజి భారత్ జోడో యాత్ర సమయంలో తుడిచిపెట్టుకు పోయి ఆయన ఓ సమగ్రమైన నేతగా ఎదిగేందుకు యాత్ర తోడ్పడిందని విశ్లేషకులు అంటున్నారు. గడ్డం రాహుల్‌కు కొంతమేరకు సీరియస్‌నెస్‌ను ఇచ్చిందని అతను ఇప్పుడు పరిపక్వత చెందిన మనిషిగా కనిసిస్తున్నారని అడ్వర్టయిజ్ పరిశ్రమలో తలపండిన ప్రహ్లాద్ కక్కర్ అభిప్రాయపడ్డారు. ‘ఆయన ఇప్పుడు ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్ గాంధీ కుమారుడు ఎంతమాత్రం కాదు. ఆయన రాహుల్ గాంధీ.. ఓ వ్యక్తిత్వం ఉన్న మనిషి. ప్రజలు ఇప్పుడు ఆయనలో చూస్తున్న కీలక మార్పు అది’ అని ఆయన అంటున్నారు. ఓ రాకుమారుడిగా పెరిగిన రాహుల్ గాంధీ రోజుకు 20 25కిలోమీటర్ల చొప్పున ఇన్ని రోజులు నడవగలరని మొదట్లో ఎవరూ ఊహించలేదు.

అయితే ఆయన సునాయాసంగా ప్రతిరోజూ తన యాత్రను రెట్టించిన ఉత్సాహంతో కొనసాగించడం చూసి విపక్షాల వాళ్లే కాదు, సొంత పార్టీ వాళ్లు కూడా ఆశ్చర్య పోయారు.అదే ఆయనకు అవేష ప్రజల మద్దతునిచ్చింది. మొక్కవోని పట్టుదల ఆయన యాత్ర పూర్తి చేసేలా చేసింది. ఎంతటి కష్టాన్నయినా దేశం కోసం భరించగలిగే శక్తి ఆయనకు వారసత్వంగా వచ్చిందేమోనని పిస్తోంది. ఎముకలు కొరికే చలిలో సైతం కేవలం టీ షర్టుతో యాత్ర సాగించిన రాహుల్ గాంధీ చివరి రోజు మాత్రమే కశ్మీర్ చలినుంచి రక్షణ కోసం కాశ్మీరీ ఫేరన్(టోపీ) ధరించారు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయతే గుబురు గడ్డం, మీసాలు ఆయనకు కొత్త ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే రాహుల్‌కు సింబల్‌గా నిలచిపోతుందేమోనని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News