Friday, April 19, 2024

16వేలకుపైగా పెరిగిన టర్కీ, సిరియా మృతుల సంఖ్య!

- Advertisement -
- Advertisement -

అంకారా: టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 16000కుపైగా పెరిగింది. కాగా భూకంపం నుంచి బతికి బట్టకట్టినవారిని ఇప్పుడు అక్కడ తీవ్ర చలి బాధిస్తోంది. ఇప్పటికీ శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని ఉండడాన్ని రెస్యూ సిబ్బంది కనుగొన్నారు. రిక్టరు స్కేలుపై 7.8గా నమోదయిన భూకంపం సంభవించి ఇప్పటికే 72 గంటలు గడిచిపోయాయి. ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడవలసిన స్థితి నెలకొని ఉంది. మరోవైపు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. భూకంపం నుంచి బతికిబయటపడ్డ వారు ఇప్పుడు తిండి, ఆశ్రయం కోసం వెంపర్లాడుతున్నారు. నిస్సహాయంగా తమ బంధువులను సాయం కోరుతున్నారు. చాలా మంది శిథిలాల కింద ఇప్పటికీ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రెస్కూవర్లు ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మరణాల సంఖ్య ఇప్పటికీ పెరుగుతోంది.

ఓ వైపు రెస్కూ ఆపరేషన్ మందకొడిగా సాగుతుండడం, మరోవైపు చలి తీవ్రత మైనస్ 23 డిగ్రీల ఫారెన్‌హీట్‌గా ఉండడం…అక్కడి విషాధాన్ని మాటల్లో విశదీకరించడం సాధ్యం కాదు. వేలాది మంది కారుల్లో, టెంట్లలో రాత్రిపూట గడుపుతున్నారు. ఇప్పటికే 12873 మంది టర్కీలో, 3162 మంది సిరియాలో చనిపోయారని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సాయం సేకరించేందుకు యూరొప్ యూనియన్ బ్రస్సెల్స్‌లో డోనర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేసింది. ‘మేము సాయం కోసం పరుగులు పెడుతున్నాం’ అని యూరొప్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ట్వీట్ చేశారు. ఐక్యరాజ్య సమితి అధికారులు కూడా సాయకార్యక్రమంలో నిమగ్నమయ్యారు. భారత్‌తో పాటు అమెరికా, చైనా, గల్ఫ్ దేశాలు కూడా సాయపడుతున్నాయి. 1999లో వచ్చిన 7.4 మాగ్నిట్యూడ్ భూకంపంలో 17000 మంది చనిపోయారన్నది ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News