Sunday, May 11, 2025

ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన కారు..ఇద్దరు యువకులు సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

నగర శివారు ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి రెండు వాహనాలు కాలిపోయాయి. కారులో ఉన్న ముగ్గురిలో ఇద్దరు సజీవ దహనం కాగా మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని బహుదూర్ పూర్ తాడ్బన్, హెచ్‌బి కాలనీకి చెందిన వ్యాపారవేత్త దీపేష్ రితేష్ కుమార్ అగర్వాల్ కుమారుడు దీపేష్ అగర్వాల్ (23) తన స్నేహితులను కలిసి వస్తానని చెప్పి కారులో బయలుదేరాడు. విజయనగర్ కాలనీ విటిసికి చెందిన సంచయ్ మల్వాని (22), మాసాపేట్‌కు చెందిన ప్రియాన్షు మిట్టల్ (23)తో కలిసి వారు శంషాబాద్ వైపు నుండి ఘట్‌కేసర్ వైపు వెళ్తున్నారు.

ఈ క్రమంలో తెల్లవారుజామున అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, గండిచెరువు బ్రిడ్జి సమీపంలో ఔటర్‌పైకి రాగానే ఎలాంటి సిగ్నిల్స్ లేకుండా ఆగి ఉన్న వాహనాన్ని వీరు ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగాయి. దాంతో రెండు వాహనాలు మంటలో పూర్తిగా దగ్ధమయ్యాయి. కారు ఉన్న ముగ్గురిలో దీపేష్ అగర్వాల్, సంజయ్ మల్వాని అక్కడిక్కడే సజీవ దహనం కాగామరో స్నేహితుడి ప్రియాన్షు మిట్టల్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఎల్‌బినగర్ కామినేనికి తరలించారు.అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News