Monday, May 6, 2024

గుర్తు మాదే ధైర్యముంటే ఎన్నికలో గెలువండి

- Advertisement -
- Advertisement -

Uddhav Thackeray is a challenge for the Rebels

రెబెల్స్‌కు ఉద్ధవ్ థాకరే సవాలు

ముంబై : తమ శివసేన పార్టీ చిహ్నం ధనస్సు, బాణెంను ఇతరులు ఎవరూ పొందలేరని పార్టీ అధ్యక్షులు, మాజీ సిఎం ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. పార్టీ చిహ్నం కూడా తమదే అవుతుందనే రెబెల్స్ వాదనను ఉద్ధవ్ శుక్రవారం తిప్పికొట్టారు. శుక్రవారం ఆయన తమ నివాసం మాతోశ్రీలో విలేకరులతో మాట్లాడారు. రెబెల్స్‌కు ధైర్యముంటే వేరే చిహ్నంతో గెలవాలని సవాలు విసిరారు. పార్టీ రెబెల్స్, బిజెపిలు దొడ్డిదారిన అధికారంలోకి రావడం కాదు. వారికి ధైర్యముంటే మధ్యంతర ఎన్నికలకు దిగి ప్రజా తీర్పును కోరాలి. ఈ ఎన్నికలలో గెలిస్తే వారిదే బలమని, వారికి ప్రజల మద్దతు ఉందని తాను అంగీకరిస్తానని , తనను ప్రజలు తిరస్కరిస్తే దీనికి తలొగ్గుతానని తెలిపారు. పార్టీ అధికారం కోల్పోతే ప్రభుత్వం పడిపోవచ్చు అంతేకానీ ఆ పార్టీ ఉంటుంది. వాస్తవికంగా క్షేత్రస్థాయిలో ఉనికిలో ఉండే రాజకీయ పార్టీ ఉంటుంది.

లెజిస్లేచర్ పార్టీ అనుబంధంగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఉండే పార్టీపై ఉండే హక్కులు ఎవరికి చెందాల్సి ఉంటుందో వారికే చెందుతాయని స్పష్టం చేశారు. ఇది చట్టబద్ధంగా ఉంటుందని ఉద్ధవ్ తెలిపారు. రెబెల్స్ శివసేన అంటే, తాను అంటే ఇప్పటికీ అభిమానం అని చెపుతారు. మరి తన కుటుంబాన్ని తిట్టిపోసి చివరికి తన కుమారుడు ఆదిత్యా థాకరేను అంతమొందించాలని చూసిన వారి పంచన ఎందుకు చేరారు? వారికి బిజెపిపై ప్రేమ ఉంటే ఆ పార్టీలోనే నేరుగా వెళ్లి చేరవచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టులో 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిష,న్ ఇతర అంశాలపై ఈ నెల 11న తీర్పు వెలువరించాల్సి ఉందని, ఇది శివసేన భవిష్యత్తునే కాకుండా, మొత్తం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిర్ధేశిస్తుందని వ్యాఖ్యానించారు. సిఎంగా రాజీనామా తరువాత ఆయన విలేకరులతో మాట్లాడటం ఇదే తొలిసారి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News