Thursday, March 28, 2024

కిడ్నాప్ కేసులో అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

లఖ్‌నవూ : ఉమేశ్ పాల్ కిడ్నాప్ కేసులో మాజీ ఎంపి , గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌తోపాటు మరో ఇద్దరిని యూపీ ప్రయాగ్ రాజ్ కోర్టు దోషులుగా తేల్చింది. ముగ్గురికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ సహా ఏడుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. అంతకు ముందు నైనీ కేంద్ర కారాగారం నుంచి భారీ భద్రత మధ్య నిందితులను కోర్టుకు తీసుకువచ్చారు. మరోవైపు… ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసుల కస్టడీలో ఉన్న తనకు ప్రాణహాని ఉందని , రక్షణ కల్పించాలని కోరుతూ అతిక్ అహ్మద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది.

2005లో జరిగిన బీఎస్పీ ఎమ్‌ఎల్‌ఎ రాజుపాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. 2019 నుంచి సబర్మతి జైల్లో ఉన్నాడు. ఇతడిపై 100 కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే రాజు పాల్ హత్య కేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ 2006లో అపహరణకు గురై విడుదలయ్యాడు. 2007లో అతడి అతీక్‌తోపాటు పలువురిపై కిడ్నాప్ కేసు నమోదు చేశాడు. ఈ కేసు విచారణ చివరి రోజు (2023 ఫిబ్రవరి 24)నే అతడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతీక్ అహ్మద్ పైనా కేసు నమోదైంది. ఈ క్రమం లోనే తాజాగా 2006 నాటి కిడ్నాప్ కేసులో కోర్టు అతీక్ అహ్మద్‌తోపాటు సౌలత్ హనీఫ్, దినేష్ పాసీలను దోషులుగా తేల్చింది.

సుప్రీం కోర్టులో చుక్కెదురు
ప్రస్తుతం యూపీ పోలీసుల కస్టడీలో ఉన్న అతీక్ అహ్మద్… తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బెలా ఎం. త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News