Friday, April 19, 2024

భారత్, పాక్‌ల మధ్య అమెరికా మాటల యుద్ధం కోరుకోవడంలేదు: ప్రైస్

- Advertisement -
- Advertisement -

న్యూ యార్క్: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ జర్దారీ భుట్టో, భారత ప్రధాన నరేంద్ర మోడీపై చేసిన విమర్శలపై అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందించారు. భారత, పాకిస్థాన్‌ల మధ్య మాటల యుద్ధం వద్దని, నిర్మాణాత్మక చర్చలు జరగాలని అమెరికా కోరుకుంటోందన్నారు. “వాస్తవానికి ఆ రెండు దేశాలతో మాకు భాగస్వామ్యం ఉంది. ఆ రెండు దేశాలు యుద్ధం చేయాలని కోరుకోవడం లేదు” అని ప్రైస్ సోమవారం వాషింగ్టన్‌లో తన బ్రీఫింగ్‌లో పేర్కొన్నారు. ఆయన ఇంకా “మేము రెండు దేశాల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరగాలని కోరుకుంటున్నాం, అది ఇటు భారత ప్రజలకు, అటు పాకిస్థాన్ ప్రజలకు మేలు చేస్తుంది” అన్నారు.

“భారత్, పాకిస్థాన్‌ల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. వాటిని పరిష్కరించుకోవాల్సి ఉంది. అయితే ఆ రెండు దేశాలకు ఈ విషయంలో సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ద్వైపాక్షిక విషయంలో మూడో పక్షం జోక్యాన్ని సహించబోమని ఇదివరకే భారత్ స్పష్టం చేసింది” అన్నారు.

ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నాక, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భారత ప్రధాని మోడీపై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. కాగా భారత్, పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాల గురించి ప్రశ్నించినప్పుడు, ఆ రెండు దేశాలు తమతమ వైఖరులపైనే నిలబడి ఉన్నాయని, వాటి మధ్య సంబంధాలు ‘జీరో సమ్ గేమ్’ ఏమి కాదని, అమెరికా ఆ రెండు దేశాలతో ఉన్న సంబంధాలను ఒక దానితో మరొకదాన్ని పోల్చి చూడదని అన్నారు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా, ఇండియా వైఖరులు వేర్వేరుగా ఉండడంపై ప్రశ్నించగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు, ప్రధాని మోడీ ‘ఇది యుద్ధాలు చేయాల్సిన యుగం కాదు’ అని చెప్పారని వ్యాఖ్యానించారు. “మోడీ మాటలకు కూడా విలువ ఉంది, ఎందుకంటే భారత్‌కు రష్యా, అమెరికాతో సంబంధాలున్నాయి” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News