Sunday, April 28, 2024

తమిళ ఈలం ఉగ్రవాది ప్రభాకరన్ మా నాన్నే .. మహిళ వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

చెన్నై : లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) మాజీ చీఫ్ ప్రభాకరన్ కుమార్తెనని చెప్పుకొంటున్న ఒక మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ‘మవీరర్ నాల్ ’ సందర్భంగా సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. ఎల్‌టిటిఇ కార్యక్తల త్యాగాలకు గుర్తుగా ఈరోజును ప్రపంచ వ్యాప్తంగా ఉండే శ్రీలంక తమిళులు సంస్మరణ దినోత్సవం జరుపుతారు. ద్వారకా ప్రభాకరన్‌గా తన పేరును ఈ వీడియో ద్వారా ఆమె పరిచయం చేసుకుంది.

“అనేక కష్టనష్టాలను, కుట్రలను ఎదుర్కొని ఇక్కడకు వచ్చాను. ఏదో ఒక రోజు ఈలం కూడా సందర్శించి ప్రజలకు సేవ చేస్తాను” అని ఆమె చెప్పుకుంది. ముల్లివైక్కల్‌లో ప్రభాకరన్, అతని కుటుంబ సభ్యులు చనిపోయారని శ్రీలంక సైన్యం ప్రకటించిన దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఈ వీడియో తెరపైకి వచ్చింది. శ్రీలంక తమిళంలో 12 నిమిషాల సేపు సుదీర్ఘంగా ఆమె ఈ వీడియోలో మాట్లాడారు. ఎల్‌టిటిఇని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక అప్పటి శ్రీలంక ప్రభుత్వం శక్తివంతమైన దేశాల నుంచి మద్దతు కోరిందని ఈ వీడియోలో ద్వారక తెలియజేశారు. రాజకీయ అవసరాల కోసం భిన్నత్వంలో ఏకత్వాన్ని నిర్ధారిస్తూ స్వేచ్ఛ కోసం ఎల్‌టిటిఇ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

విదేశాల్లోని శ్రీలంక జాతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీలంకలో అట్టడుగున ఉన్న తమిళుల భద్రత పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రత్యేక తమిళ ఈలం స్వయం ప్రతిపత్తి, అభివృద్ధిని అందిస్తుందన్న విశ్వాసాన్నివ్యక్తం చేస్తూ ఇది జాతీయ నాయకుడి దృక్కోణమని ఆమె పేర్కొంది. తమ పోరాటం సింహళ ప్రజలకు వ్యతిరేకం కాదని, తమకు వ్యతిరేకంగా అమాయకులను ప్రేరేపిస్తున్న శ్రీలంక ప్రభుత్వానికి, అవినీతి రాజకీయ నేతలకు వ్యతిరేకంగానే ఈ పోరాటమని పేర్కొన్నారు. తమ కారణాలను, సిద్ధాంతాలను సింహళీయులు అర్ధం చేసుకుంటారని ఆమె ఆశాభావం వెలిబుచ్చారు.

ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ :
ద్వారకా ప్రభాకరన్ అని ఒక మహిళ చెప్పుకునే ఈ వీడియోపై శ్రీలంక ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( ఎఐ) ఉపయోగించి ఈ వీడియోను రూపొందించినట్టు తమకు సమాచారం అందిందని శ్రీలంక ప్రభుత్వానికి సన్నిహితమైన వర్గాలు వ్యాఖ్యానించాయి. శ్రీలంక ప్రభుత్వం దీన్నిపరిశీలిస్తోందని తెలియజేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News