బాధ్యతాయుతమైన వ్యక్తులు మాట్లాడే మాటలు, వ్యవహార శైలి సమాజంలో సామాన్య ప్రజానీకానికి ఆదర్శంగా ఉండాలి. రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న ఎంఎల్ఎలు, ఎంపిలు, మంత్రులు జాతి గౌరవాన్ని, దేశ సమగ్రతను పెంపొందించే విధం గా మాట్లాడాలి. దురదృష్టవశాత్తు నేడు దేశంలో ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష రోజుకురోజుకూ దిగజారిపోతోంది. జాతి ఐక్యతకు పాటుపడుతామని ప్రమాణం చేసిన వారే జాతి సమగ్రతకు హాని కలిగించేలా మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని సైనికుల త్యాగాలను, సామర్ధ్యాన్ని కీర్తిస్తూ వారికి అండగా ఉండాల్సిన రాజకీయ నాయకత్వం సైనికులను అవమానకరపు మాటలతో వేధిస్తోంది. కులాలను, మతాలను సైన్యానికి ఆపాదిస్తూ దిగజారుడు మాటలతో దేశపరువును మంటగలుపుతున్నారు. వారానికో ఎపిసోడ్ మాదిరిగా ప్రజా ప్రతినిధులు చేస్తోన్న అడ్డగోలు, రోత వ్యాఖ్యలతో ప్రజలు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.
సైన్యాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా నిసిగ్గుగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దేశప్రతిష్టను దిగజార్చాయి. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి మీడియాకు వివరాలు అందించిన కల్నల్ సోఫియా ఖురేషికి మతాన్ని ఆపాదిస్తూ ఉగ్రవాదుల సోదరిగా వర్ణించి దేశగౌరవానికి తలవంపులు తెచ్చాడు. మంత్రి విద్వేషపు మాటలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తించింది. చివరకు ఆ రాష్ట్ర హైకోర్టు మంత్రి వ్యాఖ్యలను సుమోటాగా తీసుకుని కేసు పెట్టమని ఆజ్ఞాపించటంతో అతని నోటిదూల తీవ్రత తెలుస్తోంది. హైకోర్టు కేసు నుంచి విముక్తి కోసం విజయ్ షా సుప్రీం కోర్టు మెట్లెక్కితే క్షమాపణలు చెప్పమని ఆజ్ఞాపించింది.
విజయ్ షా క్షమాపణ చెప్పిన విధానాన్ని కూడా సుప్రీం కోర్టు ఆక్షేపించింది. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి అభ్యంతరం ఏంటని నిలదీసింది. ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయమని మధ్యప్రదేశ్ డిజిపిని ఆదేశించడంతో సిట్ ఏర్పాటు కాబడి మంత్రి వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తోంది. మంత్రి నోటి దురుసుతనంపై దేశంలోని వివిధ వర్గాల ప్రజలు, మేధావులు నిరసనను వ్యక్తం చేసినప్పటికీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం అతనిని మంత్రివర్గం నుంచి తప్పించే ప్రయత్నం చేయలేదు. సుప్రీం కోర్టు ఈ వ్యవహారంలో పలు దఫాలుగా విజయ్ షా వ్యాఖ్యలపై అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అతనిపై ఏ చర్యా తీసుకోకపోవడం దేశప్రజలను కలవరపెడుతోంది. ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు మాజీ ఎంపి రామ్ గోపాల్ యాదవ్ బిజెపి నాయకులకు తానేమి తక్కువ కాదన్నట్లు అవాకులు, చవాకులు పేలాడు. సైనికాధికారులకు కులం, మతం అంటగడుతూ విద్వేషాన్ని రాజేశాడు.
కల్నల్ సోఫియా ఖురేషిని మత ప్రాతిపదికపై బిజెపి మంత్రి విమర్శలు చేశాడని తను పనికిమాలిన వ్యాఖ్యలు చేశాడు. కల్నల్ సోఫియా ఖురేషి తోపాటు మీడియా బ్రీఫింగ్లో పాల్గొన్న వింగ్ కమాండర్ వ్యొమికా సింగ్, వైమానిక దాడులను వివరించిన ఎయిర్ మార్షల్ ఎకె భారతి కులాలను ఎంచి అనుచితంగా మాట్లాడాడు. రాజకీయ నాయకులు ఓటు బ్యాంకును స్థిరం చేసుకోవడానికి దేశంలో కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం పరిపాటి. దేశ రక్షణకోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి పనిచేసే సైనికుల మధ్య కులాల అడ్డుగోడలు కట్టడం సరైంది కాదనే ఇంగిత జ్ఞానం కూడా అతనికి లేకపోయింది. రేయింబవళ్లు కంటిమీద కునుకు లేకుండా సరిహద్దులో కాపలాకాస్తున్న సైన్యానికి కులాల, మతాల ముసుగు తొడగడంతో పొరుగు దేశాల ముందు దేశం పరువు మసకబారింది.
మధ్యప్రదేశ్ మంత్రి మాట్లాడిన మాటల మంటలు చల్లారక ముందే ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జగదీష్ దేవ్డా ప్రజలపై, సైన్యంపై విషం చిమ్మాడు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైనందుకు ప్రజలు, సైన్యం ప్రధాని మోడీ కాళ్లకు మొక్కాలని అవమానించే రీతిలో మాట్లాడాడు. వాస్తవానికి ఇతరులకు గౌరవ మర్యాదలు ఇవ్వడంలో మోడీ ఎప్పుడు ముందుంటారు. ప్రధాని తనను కలవడానికి వచ్చే ప్రతిభావంతుల కాళ్లకు నమస్కారం చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. మోడీకి ఇటువంటి నేపథ్యం ఉన్న పరిస్థితులలో దేశ ప్రజలు, సైన్యం ప్రధాని కాళ్లు మొక్కాలని ఉప ముఖ్యమంత్రి చెప్పడంలో ఔచిత్యం ఏమిటో తెలియడం లేదు. సైనికులు తమ శక్తిసామర్ధ్యాలను ప్రపంచానికి తెలియజేసినందుకు కాళ్లు మొక్కాల్సి ఉండేనా? సైన్యం ధైర్యసాహసాలతో ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేసి పాకిస్తాన్ను కాళ్ళబేరానికి తీసుకొచ్చినందుకు సాగిలపడాలా? ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయానికి ప్రజలు, ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చి ఐక్యంగా నిలబడినందుకా? మొదలగు ప్రశ్నలకు కమలనాథుల నుంచి సమాధానం ఆశించడం వృథా ప్రయాసే అవుతుంది.
దేశవ్యాప్తంగ ఓ వైపు పాకిస్తాన్ కుతంత్రాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు దౌత్యప్రచారానికి కమిటీలను నియమిస్తున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు దేశంలోపల సైన్యంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న తమ నాయకులను అదుపులో పెట్టలేకపోవడం విస్మయం కలిగిస్తోంది. దేశంలో పహల్గాం ఉగ్రదాడి, అనంతరం జరిగిన ఆపరేషన్ సిందూర్ పరిస్థితులపై బిజెపి నాయకులు మాట్లాడే మాటలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. తాజాగా హర్యానా బిజెపి రాజ్యసభ సభ్యుడు రామచందర్ జంగ్రా ఉగ్రదాడిలో భర్తల ప్రాణాలు కోల్పోయిన మహిళలపై నోరు పారేసుకున్నాడు. భర్తలను కోల్పోయిన మహిళలకు స్ఫూర్తి, విరోచిత లక్షణాలు లేవని ఉగ్రవాదులను వేడుకునే బదులు తిరగబడాల్సిందని నాలుకకు పని చెప్పాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్న ఉగ్రమూకలపై నిస్సహాయులైన మహిళలు ఏ రకంగా పోరాటం చేస్తారో అతని మేధస్సుకే తెలియాలి. గతంలో జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా పార్లమెంటు సాక్షిగా బిజెపి ఎంపి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కీర్తించింది. రూ. 100 కోసం రైతు చట్టాల వ్యతిరేక నిరసన దీక్షలో మహిళా రైతులు కూర్చున్నారని ఎంపి కంగనా రనౌత్ ఎగతాళి చేసింది.
జాతిపితపై, రైతులపై చేసిన విషపూరిత వ్యాఖ్యలకు గాను ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, కంగనా రనౌత్ పై బిజెపి ఆనాడే కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుని ఉంటే నేడు ప్రజలు, సైనికులు, వితంతువులపై అవమానకర, విద్వేష మాటలు వచ్చి ఉండేవి కావు. కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రధాన వార్తా స్రవంతిలో ఉండటానికి ఆలోచన రహితంగా ఏదిపడితే అది మాట్లాడటం, తరువాత క్షమాపణలు చెప్పటం, వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని బుకాయించటం అలవాటైపోయింది. ఢిల్లీలో జరిగిన ఎన్డిఎ పాలిత రాష్ట్రాల సిఎంలు, డిప్యూటీ సిఎంల మీటింగ్లో కీలకమైన అంశాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని, నోరు జారొద్దని సుతి మెత్తగా మోడీ చేసిన హెచ్చరిక ఏమాత్రం పని చేస్తుందో వేచి చూడాలి. దేశఐక్యత, సంస్కృతి సంప్రదాయాలు, గౌరవ మర్యాదలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పే బిజెపి తమ నాయకులు ఇష్టాను రీతిగా మాట్లాడే మాటలను అదుపు చేయనట్లయితే ప్రజల విశ్వాసాన్ని కోల్పోక తప్పదు.
– బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి, 94409 66416