న్యూఢిల్లీ: భారతీయ రెజ్లర్ నుండి రాజకీయ నాయకురాలిగా మారిన వినేష్ ఫోగట్, ఆమె భర్త సోమ్వీర్ రాథీ తల్లిదండ్రులయ్యారు. మంగళవారం ఈ దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. 30 ఏళ్ల వినేష్ ఫోగట్ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంవత్సరం మార్చి ప్రారంభంలో ఈ జంట ప్రెగ్నెన్సీని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. “మా ప్రేమకథ కొత్త అధ్యాయంతో కొనసాగుతోంది” అని క్యాప్షన్ ఇచ్చారు.
ఇక, తొలి బిడ్డకు జన్మనిచ్చిన ఫోగట్ దంపతులకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యురాలు కుమారి సెల్జా శుభాకాంక్షలు తెలిపారు. “మగబిడ్డకు జన్మనిచ్చిన జూలానా కాంగ్రెస్ ఎమ్మెల్యే పోగట్ కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన బాబు.. ఆ కుటుంబానికి ఆనందం, శుభాన్ని తీసుకురావాలని.. మీరిద్దరూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.