Friday, May 10, 2024

చత్తీస్‌గఢ్ రెండో విడత ఎన్నికల బరిలో 1,219 మంది అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్
ముఖ్యమంత్రి బాఘెల్ సహా పోటీలో హేమాహేమీలు

రాయపూర్: చత్తీస్‌గఢ్‌లో నవంబర్ 17న జరగనున్న రెండో దశ పోలింగ్‌జరగనున్న 70 అసెంబ్లీ నియోజకవర్గాల కోసం 1,219 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రెండో దశ ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలుకు గడువు సోమవారంతో మెగిసింది. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 20 నియోజకవర్గాలకు నవంబర్ 7న మొదటి దశలో పోలింగ్ జరుగుతుంది. రెండో దశ పోలింగ్ కోసం 1,219 మంది అభ్యర్థులు 1,985 నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని, మంగళవారం వీటి పరిశీలన జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విడుదల చేసిన ఓ ప్రకటన పేర్కొంది.

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 2. రెండో దశ పోలింగ్ బరిలో ఉన్న కాంగ్రెస్ ప్రముఖుల్లో ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్, ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్‌దేవ్, ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ఇక బిజెపి తరఫున బరిలో ఉన్న ప్రముఖుల్లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు నారాయణ్ చందేల్ ,మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎంఎల్‌ఎలు బ్రిజ్ మోహన్ అగర్వాల్, పున్నులాల్ మొహిలె, అజయ్ చంద్రాకర్, ఒక కేంద్ర మంత్రి సహా మగ్గురు ప్రస్తుత లోక్‌సభ సభ్యులు ఉన్నారు. రెండో దశ పోలింగ్‌లో పటాన్ నియోజకవర్గంపైనే అందరి దృష్టీ ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి బాఘెల్‌తన సమీప బంధువు, బిజెపి అభ్యర్థి విజయ్ బాఘెల్‌ను ఢీకొంటున్నారు.

విజయ్ బాఘెల్ దుర్గ్ లోక్‌సభ సభ్యుడు కూడా. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు, జనతా కాంగ్రెస్ చత్తీస్‌గఢ్ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ జోగి కూడా ఇక్కడినుంచి పోటీ చేస్తుండంతో ఈ ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది. ఇక అంబికాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి సింగ్ దేవ్ బిజెపి అభ్యర్థి రాజేశ్ అగర్వాల్‌ను ఢీకొంటున్నారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్ జరగనుంది. మొదటి దశ పోలింగ్ జరిగే మిగతా 20 నియోజకవర్గాల్లో 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

రెండో దశ పోలింగ్ జరిగే 70 నియోజకవర్గాల్లో ఎస్‌సిలకు 17 నియోజకవర్గాలు రిజర్వ్ చేయగా, ఎస్‌టిలకు 9 నియోజకవర్గాలను రిజర్వ్ చేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ జరిగిన 70 నియోజకవర్గాల్లో51 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, బిజెపి 13, జెసిసి( జె) 4, బహుజన్ సమాజ్ పార్టీ 2 స్థానాలను దక్కించుకున్నాయి.ఆ తర్వాత ఉప ఎన్నికల్లో కాంగ్సె మరో స్థానాన్ని దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 68 స్థానాల్లో విజయ భేరీ మోగించి సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, బిజెపి 15 సీట్లకు పరిమితమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News