Friday, May 3, 2024

134 చెరువులు కబ్జా

- Advertisement -
- Advertisement -

30 చెరువుల్లో 85శాతం.. 104 చెరువుల్లో 15శాతం అన్యాక్రాంతం

ఎఫ్‌టిఎల్ పరిధిలో 8,718, బఫర్ జోన్‌లో 5,343 అక్రమ నిర్మాణాల గుర్తింపు 
ప్రభుత్వానికి నివేదిక అందించిన అధికారులు

కబ్జాదారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సమాయత్తం

జీహెచ్‌ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. దాదాపు మూడొంతుల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆక్రమణలకు గురికాకుండా ఉన్నవి 51 మాత్రమేనని అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే రాజధాని చెరువులపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విచారణ జరుపుతుండగా అధికారులు వీటిపై సమగ్ర నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 185 చెరువులు ఉండగా, వాటిలో 134 చెరువుల్లో ఆక్రమణలు జరిగినట్టు అధికారు లు గుర్తించారు. ఈ ఆక్రమణలను రెవెన్యూ, హెచ్‌ఎండిఎ, ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వే చేసి నివేదికను తయారు చేశారు. 134 చెరువుల్లోని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) పరిధిలో 8,718 నిర్మాణాలు జరగ్గా, బఫర్‌జోన్ పరిధిలో 5,343 నిర్మాణాలు జరిగినట్టు అధికారులు తమ నివేదికలో పొందుపరిచారు.

అయితే ఈ కబ్జాలను చూసుకుంటే 30 చెరువుల్లో 85 శాతం కబ్జాలు కాగా, మరో 104 చెరువుల్లో 15 శాతం కబ్జాలు జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆక్రమణలను కూల్చివేయవచ్చని అధికారులు ఆ నివేదికలో పేర్కొన్నారు. కొందరు కబ్జాదారులు చెరువులను ఆక్రమించడంతో పాటు వాటిపై కో ర్టుల్లో కేసులు వేసి తప్పించుకుంటున్నారని అధికారులు ఆ నివేదిక లో తెలిపారు. అయితే కబ్జాకు గురైన 63 చెరువుల చుట్టూ ఫెన్సింగ్ కోసం ఇప్పటికే రూ.94.17 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో వాటితో చెరువుల రక్షణ నిమిత్తం ఫెన్సింగ్ వేసే పనులను అధికారులు చేపట్టారు. దీంతోపాటు చెరువుల పరిరక్షణకు సిబ్బందిని నియమించడంతో పాటు సిసి టివి కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కూకట్‌పల్లిలో అధికం
చెరువుల ఆక్రమణలో భాగంగా కూకట్‌పల్లిలోని మైసమ్మ చెరువు లో అధికంగా ఆక్రమణలు జరిగాయి. మైసమ్మ చెరువులో 1745, బహదూర్‌పురలోని మీరాలం 1635 ఆక్రమణలు, జీడిమెట్ల ఫాక్స్ సాగర్లో 1014 కబ్జాలు, సరూర్‌నగర్ పెద్ద చెరువులో 841, నాచారం పెద్ద చెరువులో 719, మల్కాజిగిరి బండ చెరువు లో 667, రామంతపూర్ చిన్న చెరువులో 555, మల్కాజిగిరి (సఫిల్‌గూడ) నడిమి చెరువులో 549, రామంతపూర్ 468, మూసాపేట్ కాముని చెరువులో 449, మల్కాజిగిరి ముక్కిడి చెరువులో 386, షేక్‌పేట్ హతం చెరువులో 370, రాయదుర్గంలోని దుర్గం చెరువులో ఆక్రమణలు జరిగినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News