Friday, March 29, 2024

156 గ్రాముల మోడీ బంగారు విగ్రహం.. అభిమానం చాటిన సూరత్ వ్యాపారి

- Advertisement -
- Advertisement -

సూరత్ : ప్రధాని నరేంద్ర మోడీపై గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన నగల వ్యాపారి బసంత్ బోహ్రా తన అభిమానాన్ని బంగారంతో చాటుకున్నారు. గుజరాత్‌లో బిజెపి ఘన విజయం నేపథ్యంలో ప్రధాని మోడీ బంగారు విగ్రహాన్ని స్వయంగా తన ఫ్యాక్టరీలో తయారు చేయించి , దీనిని బాంబే గోల్డ్ ఎగ్జిబిషన్‌లో పెట్టారు. ప్రధాని మోడీ బంగారు ముఖచిత్రంగా వెలిసిన ఈ తయారీ ఇప్పుడు పలువురిని ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ప్రచారం పొందింది. ఈ బంగారు విగ్రహాన్ని బోహ్రా గణనీయ రీతిలో 156 గ్రాముల బరువు ఉండే అసలుసిసలైన 18 క్యారెట్ల బంగారంతో తానే అంతా తానే అయి పర్యవేక్షణల నడుమ రూపొందేలా చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 182 స్థానాలలో బిజెపికి 156 స్థానాలు దక్కాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని, ఇందుకు కారణమైన వ్యక్తిగా మోడీని భావించి తాను ఈ బస్ట్ సైజ్ బంగారు విగ్రహాన్ని రూపొందించినట్లు ఈ వ్యాపారి తెలిపారు.

సూరత్‌లో రాధికా చెయిన్ జువెలరీ షాప్ యజమానిగా బోహ్రా చిరపరిచితుడు. విగ్రహాన్ని కొంటామని పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇప్పటికైతే తాను దీనిని విక్రయించే నిర్ణయం తీసుకోలేదని, అభిమానం చాటుకునేందుకు దీనిని రూపొందించానని బసంత్ తెలిపారు. తాను మోడీ అభిమానిని అని, ఆయన పట్ల ఆదరణను ఏదో విధంగా వ్యక్తం చేయాలనుకున్నానని, ఈ క్రమంలోనే ఈ విగ్రహ రూపకల్పన జరిగిందని చెప్పారు. దాదాపు 20 మంది స్వర్ణ కళాకారులు మూడు నెలల పాటు కష్టపడి దీనిని తయారు చేశారని తెలిపారు. ఈ విగ్రహానికి అవసరం అయిన బంగారానికి రూ 11 లక్షల ఖర్చు అయిందని వివరించారు.దీనికి విలువ ఖరారు చేయలేదని, విక్రయానికి పెట్టలేదని తెలిపిన బోహ్రా రాజస్థాన్ వాసి. అయితే గత 20 ఏళ్లుగా సూరత్‌లోనే ఉంటూ నగలు వజ్రాల వ్యాపారంలో పేరుగడించారు. బోహ్రా ఇంతకు ముందు స్టాట్చూ ఆఫ్ యూనిటీ బంగారు నమూనాను కూడా తయారు చేయించారు. ఇది తరువాత అమ్ముడుపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News