Saturday, April 27, 2024

బాధ్యతాయుతమైన ఎకో టూరిజాన్ని తెలంగాణలో ప్రొత్సహిస్తాం

- Advertisement -
- Advertisement -

అడవుల ప్రత్యేకత కాపాడుతూనే, పర్యావరణ హిత టూరిజం అందుబాటులోకి తెస్తాం
అమ్రాబాద్ టైగర్ రిజర్వులో ఎకో టూరిజం కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పర్యావరణ హిత టూరిజాన్ని ప్రొత్సహిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దీనిలో భాగంగా అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వుల సమీపంలో మరిన్ని ఎకో టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో పూర్తి అయిన వివిధ ఎకో టూరిజం ప్రాజెక్టులను మంత్రి శుక్రవారం నాడు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుత, ప్రకృతి రమణీయమైన ప్రాంతాలు ఒక్కోటొక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయని, వాటి ప్రత్యేకతను కాపాడుతూనే ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో మన్ననూరు వద్ద ఎకో టూరిజం రిసార్ట్ , ఆరు కాటేజీలు, ఎనిమిది కొత్త సఫారీ వాహనాలను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పర్యాటకుల సమక్షంలో మంత్రి ప్రారంభించారు. పర్యాటకులు ఒక రోజు పాటు అమ్రాబాద్‌లో గడిపేందుకు వీలుగా రూపొందించిన టైగర్ స్టే ప్యాకేజీ ఇకపై ఆన్ లైన్‌లో బుక్ చేసుకునేందుకు వీలుగా పోర్టల్‌ను ప్రారంభించారు.

అమ్రాబాద్ వచ్చే సందర్శకులకు సేవలు అందించేందుకు కొత్తగా శిక్షణను ఇచ్చిన గైడ్లు ఇకపై అందుబాటులో ఉంటారని అటవీ శాఖ ప్రకటించింది. అటవీ పర్యవేక్షణ నేరుగా చేసేందుకు వీలుగా కొత్తగా 10 లైవ్ నిఘా కెమెరాలు నేటి నుంచి పని చేయడం మొదలైందన్నారు. స్థానిక గిరిజన, చెంచు మహిళలకు ఉపాధి కల్పించే జ్యూట్ బ్యాగుల తయారీ, హెల్త్ క్లినిక్, ప్లాస్టిక్ రీ సైక్లింగ్ సెంటర్, బయో ల్యాబ్‌ల సందర్శించిన మంత్రి అక్కడ పని చేసే వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్రాబాద్‌తో పాటు అటవీ ప్రాంతాల్లో పర్యటించే ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని మంత్రి కోరారు.

అన్ని అడవులు ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ప్రకటించామని, వన్యప్రాణులకు హాని చేసే ప్లాస్టిక్‌కు అడవుల నుంచి దూరంగా ఉంచాలని తెలిపారు. జాతీయ సంపదలు అయిన అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి , ఎంపి పి. రాములు, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎంఎల్‌ఏ గువ్వల బాలరాజు , ఫారెస్టు కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప రెడ్డి, పిసిసిఎఫ్ అండ్ హెచ్‌ఓఎఫ్‌ఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, ఎఫ్‌డిసి విసి చంద్రశేఖర్ రెడ్డి,ఫీల్డ్ డైరెక్టర్ క్షితిజ, పిసిసిఎప్ (కంపా ) లోకేష్ జైస్వాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News