ఇస్లామాబాద్: టెస్టు క్రికెట్లో తమ ప్రదర్శన ఇంకా చాలా మెరుగు పడాల్సి ఉందని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ పేర్కొన్నాడు. 2019 సంవత్సరం తమ జట్టుకు చేదు జ్ఞాపకాలే మిగిల్చిందన్నాడు. అయితే పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్వదేశంలో ఓ టెస్టు సిరీస్ జరగడం కాస్త ఊరటనిచ్చే అంశమేనన్నాడు. ఈ ఏడాది జరిగిన వరల్డ్కప్లో తమ జట్టు బాగానే ఆడినా రన్రేట్ కారణంగా సెమీస్కు చేరకుండానే నిష్క్రమించడం ఎంతో బాధకు గురి చేసిందన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ప్రపంచకప్లో తాము మెరుగ్గానే ఆడామని, అయితే సెమీస్ బెర్త్ దక్కక పోవడం ఆవేదన కలిగించిందన్నాడు.
మరోవైపు సొంత గడ్డపై శ్రీలంకతో జరిగిన ట్వంటీ20 సిరీస్లో క్లీన్స్వీప్కు గురి కావడం ఎంతో బాధించిందన్నాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా పాకిస్థాన్ సిరీస్కు వచ్చిన శ్రీలంక తమను మూడు మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడించడం ఇప్పటికీ ఓ పీడకలగా వెంటాడుతూనే ఉందన్నాడు. ఈ సిరీస్లో ఓటమి తనను ఎంతో మనోవేదనకు గురి చేసిందన్నాడు. అంతేగాక దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరిగిన సిరీస్లలో పరాజయం పాలు కావడం కూడా బాధించే అంశమనేనని మిస్బా పేర్కొన్నాడు. కాగా, ఈ ఏడాది సొంత గడ్డపై వన్డే, టెస్టు సిరీస్ ఆడడం, ఇందులో విజయం సాధించడం పెద్ద ఊరటనిచ్చిందన్నాడు. రానున్న ఏడాది తమ జట్టుకు చాలా కీలకమన్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే ట్వంటీ20 ప్రపంచకప్లో మెరుగైన ప్రదర్శన కనబరచడం తమ ముందున్న ప్రధాన లక్షమని మిస్బా పేర్కొన్నాడు.
2019 was a Tough Year for Pakistan in Tests