ఆరు మిలియన్ హెక్టార్ల భూమి బుగ్గి
మెల్బోర్నె: చరిత్రలో అత్యంత అధ్వాన్న కార్చిచ్చుగా రికార్డు కెక్కిన ఆస్ట్రేలియా కార్చిచ్చు జ్వాలలకు 24 మంది ఆహుతయ్యారని, ఆరు మిలియన్ హెక్టార్ల భూమి బుగ్గయి పోయిందని కొన్ని వందల ఇళ్లు బూడిదయ్యాయని, అనేక వన్యప్రాణులు అంతరించిపోయాయని అధికార వర్గాలు వెల్లడించాయి. దేశం లోని ఆగ్నేయ ప్రాంతం అగ్ని గుండమై వేడి గాలులు విస్తరిస్తుండడంతో మళ్లీ కార్చిచ్చు చెలరేగే ప్రమాదం ఉందని అధికార వర్గాలు తాజాగా హెచ్చరించాయి. విక్టోరియా ప్రాంతంలో ఇంకా 23 చోట్ల కార్చిచ్చు జ్వాలలు ఎగసి పడుతున్నాయని ఎమర్జెన్సీ మేనేజిమెంట్ కమిషనర్ ఆండ్రూ క్రిస్ప్ హెచ్చరించారు. మరో 48 గంటల్లో మరో ప్రమాదం పొంచి ఉందని చెప్పారు.
ఆయా ఫైర్జోన్ల లో ఉండే ప్రజలు తక్షణం ఆ ప్రాంతాల నుంచి వెళ్లి పోవాలని విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ గురువారం హెచ్చరించారు. 244 ఇళ్లు దెబ్బతిన్నాయని, మరో 400 ఇళ్లు ప్రమాదం అంచున ఉన్నాయని క్రిస్ప్ తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పారు. న్యూసౌత్ వేల్స్, కంగారూ ఐలాండ్, ప్రాంతాల్లోనూ కార్చిచ్చు ప్రమాదం కమ్ముకుంటోంది. ప్రజలను రక్షించడమే ప్రధాన లక్షంగా అధికార యంత్రాంగం పనిచేస్తోంది. దాదాపు 3000 అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పడంలో నిమగ్నమయ్యాయి.
24 killed over 6 mn hectares of land burned in Australia