Sunday, April 28, 2024

18ఏళ్ల చెర వీడి స్వేచ్ఛలోకి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణకు చెందిన శివరాత్రి మల్లేశ్, శివరాత్రి రవి, దుండుగుల లక్ష్మణ్, శివరాత్రి హన్మంతు, వెంకటేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ బహదూర్ సింగ్ అనే నేపాలీ గూర్ఖాను హత్య చేసిన కేసులో ఈ ఐదుగురికి పాతికేళ్ల జైలు శిక్ష పడింది. అయితే, కెటిఆర్ మంత్రిగా ఉన్న సమయంలో వీరి శిక్ష తగ్గింపునకు కృషి చేశారు. గతేడాది సెప్టెంబరులో దుబాయ్‌లో పర్యటించిన సందర్భంగా కెటిఆర్ అక్కడి ప్రభుత్వానికి దీనిపై విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రయత్నాల ఫలితంగా వారి క్షమాభిక్ష పిటిషన్ కు యూఏఈ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ హత్య కేసులో శిక్ష పడిన వారు రాజన్న సిరిసిల్ల జిల్లా (సిరిసిల్ల, రుద్రంగి, కోనరావుపేట, చందుర్తి మండలాలకు) చెందినవారు. సిరిసిల్ల నియోజకవర్గానికి కెటిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో, దుబాయ్ లో 18 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన శివరాత్రి మల్లేశ్, అతడి సోదరుడు శివరాత్రి రవి నేడు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా, అక్కడ తీవ్ర భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి.

కుటుంబ సభ్యులను కలుసుకుని కన్నీటిపర్యంతమ య్యారు. కాగా, దుబాయ్ నుంచి దుండుగుల లక్ష్మణ్ రెండు నెలల క్రితమే తెలంగాణకు తిరిగి రాగా, శివరాత్రి హన్మంతు రెండ్రోజుల కిందట సొంతగడ్డకు చేరుకున్నాడు. హత్య కేసులో శిక్ష అనుభవించిన ఐదో వ్యక్తి వెంకటేశ్ వచ్చే నెలలో దుబాయ్ జైలు నుంచి విడుదల కానున్నాడు. వీరు దుబాయ్ నుంచి తెలంగాణ తిరిగొచ్చేందుకు కెటిఆర్ విమాన టికెట్లు ఏర్పాటు చేసి నట్టు తెలుస్తోంది. 2011లో కెటిఆర్ నేపాల్‌కు వ్యక్తిగత పర్యటనపై వెళ్లి, దుబాయ్‌లో హత్యకు గురైన గూర్ఖా బహదూర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి రూ.15 లక్షల పరిహారం కూడా అందించారు. ఈ క్రమంలోనే గూర్ఖా కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పిటిషన్‌పై సంతకం చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ మెర్సీ పిటిషన్ ను యూఏఈ ప్రభుత్వం తొలుత తిరస్కరించింది. దాంతో కెటిఆర్ దుబాయ్ లోని భారత కాన్సుల్ జనరల్ వర్గాలు, కేసును వాదిస్తున్న అరబ్ న్యాయవాది, ప్రభుత్వ అధికారుల ద్వారా ఈ వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే వచ్చారు.

2023 సెప్టెంబరులో దుబాయ్ పర్యటనకు వెళ్లినప్పుడు ప్రత్యేకించి ఈ కేసు అంశంలో క్షమాభిక్ష పిటిషన్ ను యూఏఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఐదుగురు వ్యక్తులు ఇప్పటికే చాలాకాలం జైల్లో గడిపారని, వారు సత్ప్రవర్తనతో మెలుగుతున్నారని జైలు అధికారులు కూడా సర్టిఫికెట్ ఇచ్చారని యూఏఈ ప్రభుత్వానికి వివరించారు. ఈ నేపథ్యంలో, కెటిఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ ప్రభుత్వం తెలంగాణ వ్యక్తుల జైలు శిక్ష కాలాన్ని తగ్గించింది. 18 ఏళ్ల తర్వాత తమ వారిని చూసిన కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తమ వారి విడుదలకు చొరవ చూపిన కెటిఆర్‌కు బాధిత కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News