రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలో నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్,
మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల విస్తరణతో రాష్ట్రమంతా వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. కాగా, ఐదు రోజుల వర్ష సూచన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.