మనతెలంగాణ, సిటీబ్యూరో: అత్తాపూర్ లక్ష్మీ కాలనీ సమస్యలు యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జోనల్ కమీషనర్ వెంకన్న తో కలిసి కమీషనర్ అత్తాపూర్ లక్ష్మీ నగర్ కాలనీ లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కమీషనర్ ను కోరారు. కాలనీలో ముఖ్యంగా దోమల సమస్య, మెయిన్ రోడ్డు నుండి కాలనీ వరకు రోడ్డు వెడల్పు, కాలనీ చుట్టూ ఉన్న మూసి పరివాహక స్థలంలో ప్రైవేటు వ్యక్తులు భవన నిర్మాణ వ్యర్థాలు డంపు చేస్తున్నారని, అందువలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆర్.డబ్ల్యూ.ఎస్ ప్రతినిధులు కమిషనర్ కు వివరించడం తో అక్కడున్న జోనల్, డిప్యూటీ కమీషనర్ లను ఆదేశిస్తూ వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దోమల నివారణకుఎంటమాలజివిభాగం ద్వారా చర్యలు తీసుకుంటామని కమీషనర్ తెలిపారు. అదే విధంగా సి అండ్ డి డంప్ ను నివారణకు విజిలెన్స్ అధికారుల తో చర్యలు తీసుకుంటామని అన్నారు. అక్రమంగా డంప్ చేయకుండా వాహనాల పై కేసు పెట్టి చర్యలు తీసుకుంటామని కమీషనర్ వారికి వివరించారు.వీధి దీపాల సమస్య త్వరలోతీర్చడానికి చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ వివరించారు. ఇట్టి సమస్య శాశ్వత పరిష్కారం చేయనున్నట్లు కమిషనర్ వివరించారు.సింగిల్ ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని కమీషనర్ కోరారు.అందుకు వీధి వ్యాపారులు షాపు యజమానులు సింగిల్ ప్లాస్టిక్ వాడకం పై కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండి నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
పర్యావరణ పరిరక్షణకు అందరి పై బాధ్యత ఉందని, వీధి కుక్కల బెడదను అరికట్టుటకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఆర్ డబ్లు ఏ సభ్యులు కూడా పర్యవేక్షణ చేయాలన్నారు. ముఖ్యంగా మూసి రివర్ బెడ్ లో రాత్రి సమయంలో భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త, ఆహార వ్యర్థాలు అక్రమంగా డంప్ చేస్తున్నారని వాటిని నియంత్రణ చేయకపోతే వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కమిషనర్ ను కాలనీ ప్రతినిధులు కోరారు. కమీషనర్ వెంట జోనల్ కమీషనర్ వెంకన్న, డిప్యూటీ కమీషనర్ రవి కుమార్, టౌన్ ప్లానింగ్ ఏ సి పి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.