Friday, September 19, 2025

హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు..నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ అంటే కేవలం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ మాత్రమే కాదు, నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచేలా నగరాభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్రం నుంచి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, వివిధ శాఖల ప్రతినిధులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సహాయ పథకాలు, ప్రాజెక్టుల అమలు స్థితిపై సమీక్షలో చర్చించారు. గత దిశా సమావేశం తర్వాత తీసుకున్న చర్యలపై నివేదికలను పరిశీలించి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర పథకాలను సమయానుకూలంగా, సమర్థవంతంగా అమలు చేయడానికి శాఖల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అన్ని శాఖలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. హైదరాబాద్ నగరంలో నిధుల కొరత ఉన్నప్పటికీ, లభ్యమవుతున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి చేయాలన్నారు.

పేదల సమస్యలు పరిష్కరించేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి
బస్తీలు, మురికివాడల్లో ఇంకా పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారం కోసం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని కిషన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లు జలమయమై ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇటీవల వర్షాల కారణంగా నాంపల్లిలో ఇద్దరు, సనత్‌నగర్‌లో ఒక యువకుడు నాలాలో కొట్టుకుపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలతో పాటు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేసి నగర ప్రాధాన్యతను గుర్తుంచుకొని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏ బస్తీకి వెళ్లినా వర్షపు నీరు, వరదలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అనేక ప్రాంతాల్లో డ్రైయినేజీ సిస్టం దెబ్బతిందని అన్నారు. అది తాగునీటితో కలిసిపోతోందని దీనివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్స్, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టల్స్ వంటివాటిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.

హైడ్రాతో సమన్వయం చేసుకొని ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలి
హైడ్రాతో సమన్వయం చేసుకొని ముంపు లేకుండా శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కోరారు. ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డిలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ కేబుల్ వైర్ తగిలి కరెంటు షాక్ కొట్టి చనిపోయారని సిటీలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నారన్న ఆయన సరి చేయాల్సిందే కానీ ఇంటర్నెట్ రాకపోతే ఎలా, విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, దీనికి వెంటనే పరిష్కార మార్గం చూడాలని విజ్ఞప్తి చేశారు.

వర్షాలు భారీగా కురవడం సంతోషమే కానీ, ఎన్నడు నీళ్లు రాని కాలనీలు కూడా మునుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.కంటోన్మెంట్‌లో విమాననగర్‌లో 10 అడుగుల నీళ్లు నిలుస్తున్నాయని తెలిపారు. ప్రత్యేక కేసుగా పరిగణించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. చాలా అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు లేవని, ఒకే గదిలో పిల్లలు ఉంటున్నారని, అదే రూంలో వంట చేస్తున్నారని తెలిపారు. స్కూల్‌కి సెంట్రల్ కిచెన్ ఎలా ఉందో, అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెంట్రల్ కిచెన్ నుండి భోజనం పంపించే ఏర్పాటు చేయాలని రాజేందర్ సూచించారు.వర్షాల వల్ల రోడ్లు మొత్తం దెబ్బతిన్నాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News