గతవారం అహ్మదాబాద్ లో గతవారం కూలిపోయిన ఎయిర్ ఇండియా ఏఐ-171 నుంచి స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్స్ బాగా దెబ్బతింది. దీంతో బ్లాక్ బాక్స్ లోని డేటాను రికవరీ చేసేందుకు దానిని అమెరికాకు పంపే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది. ముఖ్యంగా విమానం క్రాష్ అయిన తర్వాత భారీగా మంటలు చెలరేగడంతో బ్లాక్ బాక్స్ కు సెగ తగిలింది. బ్లాక్ బాక్స్ పై భాగం కూడా అంటుకుంది. అయితే, ఆ నివేదిక వాస్తవంగా తప్పు అని భారత విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో డైరెక్టర్ జనరల్ జివిజి యుగంధర్ పేర్కొన్నారు. అయితే ఆయన ఇక ఏ వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం భారీగా దెబ్బతిన్న బ్లాక్ బాక్స్ నుంచి డేటా సేకరించే టెక్నాలజీ మన వద్ద లేదు. అందువల్ల ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్ డిఆర్) విశ్లేషణకు వాషింగ్టన్ లోని నేషనల్ సేఫ్టీ ట్రాన్స్ పోర్ట్ బోర్డ్ ( ఎన్ టిఎస్ బి) ప్రయోగశాలకు పంపనున్నారు. ఇప్పటికే
దారుణ ప్రమాద ఘటనపై విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబి) దర్యాప్తు చేస్తోంది.డేటా రికవరీ అయిన తర్వాత ఆ నివేదికను కూడా ఆ సంస్థతో ప్రభుత్వం విశ్లేషిస్తుంది. బ్లాక్ బాక్స్ నుంచి డేటాను సేకరించడానికి రోజులు లేదా నెలలు పట్టవచ్చు.
అయితే అది బ్లాక్ బాక్స్ కు ఏ మేరకు నష్టం జరిగిందన్న దాన్ని బట్టి ఉంటుందని నివేదిక పేర్కొంది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలు దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే ప్రమాదానికి గురైంది. ఈ విషాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో సహా 274 మంది మరణించారు. విమానం క్రాష్ అయిన వెంటనే ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. ఆ తీవ్రత ఎంత ఉంది అంటే,ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా రూపొందించిన బ్లాక్ బాక్స్ కూడా తీవ్రంగా దెబ్బతింది. దర్యాప్తు పూర్తి చేయడానికి మూడు నెలలు గడువుగా ఏఏఐబి నిర్ణయించింది. విమానం క్రాష్ అయిన రెండు రోజుల తర్వాత కాక్ పిట్ వాయిస్ రికార్డర్, (సివిఆర్) ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్ డిఆర్) ను స్వాధీనం చేసుకున్నారు. పైలెట్ సంభాషణలతో సహా కాక్ పిట్ లో ఆడియోలను సివిఆర్ సంగ్రహిస్తుంది. కాగా, ఫ్లైట్ డేటా రికార్డర్ తో కలిసి బ్లాక్ బాక్స్ లో
సమాచారం ఉంటుంది.