Saturday, July 27, 2024

మూడు రోజులు హైదరాబాద్ లో కాలుష్యం ఎందుకు తగ్గిందో తెలుసా?

- Advertisement -
- Advertisement -

ఓటు వేసేందుకు సొంతూళ్లకు ప్రజలు
మూడు రోజుల పాటు నగరంలో తగ్గిన కాలుష్యం
గణాంకాలను వెల్లడించిన పిసిబి

మనతెలంగాణ/హైదరాబాద్: ఇరు రాష్ట్రాల ప్రజలు ఓటు వేసేందుకు తమ సొంతూళ్లకు వెళ్లడంతో మూడు రోజుల పాటు నగరంలో కాలుష్యం తగ్గిందని పిసిబి అధికారులు వెల్లడించారు. రోజువారీ కాలుష్యం కన్నా చాలా తక్కువగా కాలుష్యం తక్కువ నమోదయ్యిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు తాజాగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. మే 11వ తేదీన గాలిలో పార్టిక్యులేట్ మేటర్ (పిఎం)-2.5 సూక్ష్మకణాలు క్యూబిక్ మీటర్ 45 మైక్రోగ్రాములు కాగా, పోలింగ్‌కు ముందురోజు (12వ తేదీన) 22 మైక్రోగ్రాములుగా, పోలింగ్ రోజున (13వ తేదీన) 21మైక్రోగ్రాములు, మరుసటి రోజు (14వ తేదీన) 48 మైక్రోగ్రాములు ఉన్నట్లుగా గణాంకాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలోనే పార్టిక్యులేట్ మేటర్ (పిఎం)- 10 సూక్ష్మకణాలు మే 11వ తేదీన క్యూబిక్ మీటర్ 130 మైక్రోగ్రాములు కాగా, మే 12వ తేదీన 44 మైక్రోగ్రాములు, మే 13వ తేదీన 41 మైక్రోగ్రాములుగా, మే 14వ తేదీన 80 మైక్రోగ్రాములుగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇంధనం కాల్చడం వల్ల వాహనాల నుంచి వెలువడే విషపూరిత వాయువు నైట్రెస్ ఆక్సైడ్ మే 11వ తేదీన క్యూబిక్ మీటర్‌కు 30.3 మైక్రోగ్రాములు ఉండగా, మే 12వ తేదీన 25.9 మైక్రోగ్రాములు, మే 13వ తేదీన 27.4 మైక్రోగ్రాములు, మే 14వ తేదీ 25.7 మైక్రోగ్రాములుగా నమోదయ్యిందని అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో నగరంలో రోజుకు పిఎం 2.5 సూక్ష్మకణాలు క్యూబిక్ మీటర్‌కు 60, పిఎం 10 సూక్ష్మకణాలు క్యూబిక్ మీటర్‌కు 100 మైక్రోగ్రాములు ఉంటాయని పిసిబి ఈ నివేదికలో పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News