Tuesday, June 17, 2025

విషాదం మధ్య కొసమెరుపు ఐక్యత

- Advertisement -
- Advertisement -

భద్రతా సమస్యలు, సాంకేతిక వైఫల్యాలను మించి ఏ విషయాన్ని అయినా తేలిగ్గా తీసుకునే మనస్తత్వాలు, ఆలోచనాధోరణులు పెరిగి పోయాయి. ‘చెల్తాహై’ అనే నిర్లక్ష్య ధోరణి చాలా విషయాలను ఏదో విధంగా మారుస్తుందని సామాజిక శాస్త్రవేత్త దీపాంకర్ గుప్తా అన్నారు. ఈ ధోరణి విమానయాన సంస్థలకూ వ్యాపించింది. మనదేశంలో విమానసంస్థలు కాలం చెల్లిన విమానాలను నడుపుతాయి. పైలెట్లు చాలా తీవ్రమైన షెడ్యూల్ ఎదుర్కొంటారు. ఇక విమానాశ్రయాలలో పాతకాలం నాటి మౌలిక సదుపాయాల మధ్యే పెరుగుతున్న ట్రాఫిక్ ను నిర్వహిస్తున్నారు. డిజిసిఏ సిబ్బంది సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 153 విమానాశ్రయాలు, 1500 విమానాలను కేవలం 1,200 మంది ఉద్యోగులే పర్యవేక్షిస్తున్నారు. ఫలితంగా సమస్యలు తీవ్ర మవుతున్నాయి.

అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ 2023 ఆడిట్‌లో భారతదేశంలో భద్రతా పర్యవేక్షణ ప్రమాణాలు ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. శిక్షణ, పర్యవేక్షణ, నిర్వహణలో ఉన్న లోపాలు, అంతరాలను ఆడిట్ వివరించింది. 2022లో ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ (Air India privatization) జరిగింది. ఆ తర్వాత విమానాలు, భద్రతా ప్రొటోకాల్ ను ఆధునీకరించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎయిర్ లైన్స్ నిర్వహణ కంటే, షెడ్యూల్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని మాజీ ఉద్యోగులు అంటున్నారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ లోని పోస్ట్ లలో ఇది ప్రతిధ్వనిస్తోంది. ఎయిర్ ఇండియా ఖర్చు తగ్గింపు వైఖరితో విపత్తు పొంచి ఉందని ఫ్లై సేఫ్ ఇండియా అన్న నెట్ వర్క్ పేర్కొంది. ప్రమాదానికి గురైన ఏఐ171 విమానంలోని 12 మంది సిబ్బందిలో 20 ఏళ్ల నగంథోయ్ శర్మ, 26 ఏళ్ల లామ్నుంథెమ్ సింగ్సన్ ఉన్నారు.

మణిపూర్ యువత ఆకాంక్షలను ప్రతిబింబించే ఆ ఇద్దరూ విమాన సహాయకులుగా ఉన్నారు. మణిపూర్ లోని తౌబాల్ కు చెందిన మైటీ నగంథోయ్, ఇంఫాల్ లోని డిఎం కాలేజ్ ఆఫ్ కామర్స్ లో జరిగిన క్యాంపస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ తర్వాత 2023 ఏప్రిల్ లో ఎయిర్ ఇండియాలో చేరారు. ప్రపంచాన్ని అన్వేషించాలనే నగంథోయ్ ఉత్సాహాన్ని ఆమె సోదరి గీతాంజలి గుర్తుచేసుకుంది. ఆమె మొదటి ప్రయత్నంలోనే క్యాబిన్ క్రూ కోసం జరిగిన ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించడంతో తర్వాత ఆమె ఈ కల ఆవిషృ్కతమైంది. జూన్ 15న తిరిగి వస్తానని తన సోదరి చివర్లో చెప్పిందని గీతాంజలి గద్గద స్వరంతో ఉంది. అలాంటి సమయంలోనే మేం ప్రమాదం గురించి విని చలించిపోయామని పేర్కొంది. థాడౌ కమ్యునిటీకి చెందిన కుకి-జో జాతికి చెందిన లామ్నుంథెమ్ 2024లో ఎయిర్ ఇండియాలో చేరారు.

2023 మేలో మణిపూర్ లో చెలరేగిన జాతుల హింసాకాండ కారణంగా అమె కుటుంబం ఇంఫాల్ లోని ఓల్డ్ లంబులేన్ నుంచి కాంగ్ పోక్సికి పారిపోయి అక్కడ అద్దె ఇంట్లో ఉంటూ వచ్చింది. ఆమె తల్లి వితంతువు, ముగ్గురు సోదరులు (వీరిలో ఒకరు దీర్ఘకాలిక అనారోగ్యంతో పోరాడుతున్నారు) వీరికి ఏకైక జీవనాధారం.. లామ్నుంథెమ్ సంపాదనే. లామ్నుంథెమ్ జూన్ 11న చివరిసారిగా తన తల్లితో మాట్లాడిందని, లండన్ నుంచి వచ్చిన తర్వాత మళ్లీ ఫోన్ చేస్తానని హామీ ఇచ్చిందని, ఆ కాల్ ఇప్పటికీ రాలేదు. ఇక రాదు అని ఆమె బంధువు లున్కి ప్జెన్ తెలిపారు. మణిపూర్‌లో 2023 మేలో చెలరేగిన జాతుల ఘర్షణ 250 మందిని బలితీసుకుంది. దాదాపు 60వేల మంది నిరాశ్రయులయ్యారు. మైటీ, కుకీ-జో కమ్యునిటీల మధ్య తీవ్ర అంతరాలను పెంచింది. దీంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలు హెచ్చాయి.

అయినప్పటికీ ఆకాశమార్గంలో కలిసి పని చేసిన నగంథోయ్, లామ్నుంథెమ్ లను కోల్పోవడం అరుదైన ఐక్యతను తాకినట్లయింది. జాతి ఉద్రిక్తతలతో మణిపూర్ రగిలిపోయినప్పుడు పరస్పరం జాతిపరమైన పగలను విస్మరించడం కష్టం. అయినా వారు ఆకాశంలో కలిసి పనిచేశారు అని మైటీఖంబా అనే సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. ఎక్స్ లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఓ అరుదైన భావన వ్యక్తమవడం ఓ కొసమెరుపు. అహ్మదాబాద్ ప్రమాదంపై జవాబుదారీ ఉండాలని, దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. విమానాన్ని కచ్చితంగా ఎందుకు తనిఖీ చేయలేదని నగంథోయ్ తండ్రి కంగ్పైలతం టోబా సింగ్ ప్రశ్నించారు. తన కూతురు ఇంటికి రావలసిఉండేదని ఆయన కన్నీటితో అన్నారు.

నగంథోయ్, లామ్నుంథెమ్ ల అకాల మరణం మణిపూర్ ను దుఖ సముద్రంలో ముంచింది. వారి మరణాలు వైమానిక సంస్థలో వ్యవస్థాగత వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి. వారి మృతదేహాల కోసం అటు అహ్మదాబాద్ లోనూ, ఇటు ఇంఫాల్ లోనూ జనం ఎదురుచూపులు, విసృ్తత ఉద్యమంలో కలిసిపోయాయి. విమానయాన నిపుణులు, సామాన్యులు కూడా డిజిసిఏ స్వతంత్రంగా నిర్దిష్టమైన భద్రతా ప్రొటోకాల్ ను కఠినంగా అమలు చేయాలని, విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రమాదం భారతదేశానికి చివరి మేలు కొలుపు కావాలని కెప్టెన్ రంగనాథన్ అన్నారు. మనం ఇక ఎంతమాత్రం యువతను బలిపెట్టుకుంటూ ఉండలేము అన్నారాయన. మణిపూర్ లో ఇద్దరు కుమార్తెలను కోల్పోవడం జాతి విభజనను అధిగమించి, ఐక్యతా పరమైన దృష్టి కోణాన్ని ఆవష్కరించింది.

తౌబాల్ లో నగంథోయ్ కుటుంబం ఇప్పటికీ ఆశతో ఆమె ఫోన్ కు డయల్ చేస్తోంది కాంగ్ పోక్సీలో లామ్నుంథెమ్ తల్లి వారి ఆత్మలకు శాంతి ప్రసాదించాలని ప్రార్థిస్తోంది. భారతదేశ విమానయాన సంక్షోభంలో సాగే వారి కథ భద్రత అనేది లగ్జరీ కాదు. అవసరం అనే విషయాన్ని స్పష్టీకరిస్తోంది. అహ్మదాబాద్ లో 270 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతుండగా, ఈ విషాదం తర్వాత నైనా భారతదేశం భద్రతకు పెద్దపీట వేస్తుందా. లేక నిర్లక్ష్యం పునరావృతం అవుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తౌబాల్‌లో నగంథోయ్ కుటుంబం ఆశలు అడుగంటిపోతున్నాయి. ఆమె ఫోన్ కు డయల్ చేస్తూనే ఉన్నారు. ఆ ఫోన్ ఇప్పటికీ రింగ్ అవుతోంది. కానీ సమాధానం రావడం లేదు. ఇక కాంగ్ పోక్సీలో లామ్నుంథెమ్ బంధువులు ఆమె కుటుంబాన్ని ఓదార్చేందుకు గుమికూడారు.

ఇరుగూ పొరుగూ వారి కష్టంలో తోడుగా నిలుస్తున్నారు. మణిపూర్ నుంచి వెలువడుతున్న సోషల్ మీడియా పోస్ట్ లు హృదయవిదారకమైన ఐక్యతను ప్రతిబింబిస్తున్నాయి. వివాదంతో విడిపోయిన రెండు మణిపూర్ కుటుంబాలు ఇప్పుడు దుఖంతో నిండిపోయాయి. అని సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు. స్క్రోల్ ఇన్నోటెడ్ సోషల్ మీడియా పోస్ట్ లో -విభజిత మణిపూర్ ఇద్దరు సిబ్బంది మరణంతో విషాదంలో ఐక్యమైంది -ఒక కుకి, ఒక మెటిటీ. అని పేర్కొంది. అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదం భారతీయ విమానయాన భద్రతపై మరోసారి క్షణ్ణంగా పరిశీలించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. 1988లో అహ్మదాబాద్ లో జరిగిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఐసి- 113 ప్రమాదంలో 130 మంది మరణించారు. 2010లో మంగళూరులో జరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 158 మంది మరణించారు.

ఈ ప్రమాదాలు తరచు మానవ తప్పిదాలో, అననుకూల వాతావరణమో, సాంకేతిక సమస్యలతో జరిగిన విషాదాల చరిత్రను తేటతెల్లం చేస్తున్నాయి.ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానాలపై భద్రతా పరమైన తనిఖీలు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించింది. డ్రీమ్ లైనర్‌లో తయారీలో షాట్ కట్‌ల గురించి విజిల్ -బ్రోవర్ వాదనల తర్వాత బోయింగ్ సంస్థ కొత్త ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అయినా బోయింగ్ విమానాలు అత్యంత సురక్షితమైనవని ఆ కంపెనీ నొక్కి చెబుతోంది. మణిపూర్‌కు సంబంధించినంతవరకూ, నగంథోయ్ , లమ్నుంథెమ్ లను కోల్పోవడం భారత విమానయాన చరిత్రలో ఓ కీలక ఘట్టం. ఉమ్మడి మానవత్వాన్ని గుర్తుచేసే హృదయ విదారక సంఘటన. వారి మరణాలు అహ్మదాబాద్‌లో కొవ్వొత్తుల వెలుగు జాగృతికి దారి తీశాయి. విభజిత మణిపూర్‌లో శాంతి కోసం పిలుపునిచ్చాయి.

వారికి ఆత్మశాంతి కలగాలని, వారి ఆత్మలు కలిసి శాంతితో విశ్రాంతి తీసుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ పిషెంబాసనా జవోబా ప్రార్థించారు. ఈ భావనను విచ్ఛిన్నమైన స్థితిలో ఐక్యతకు చిహ్నంగా చూస్తున్నారు. విమాన ప్రమాదం కారణాలను కనిపెట్టేందుకు పరిశోధకులు, విమానం శిథిలాలను గాలిస్తుంటే, వారి కుటుంబాలను తమ ప్రియమైనవారి మృతదేహాలను అందుకునేందుకు, డిఎన్‌ఏ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్ కు చెందిన ఇద్దరి యువతుల కథ ప్రత్యేకంగా నిలుస్తోంది. జీవితంలో వారు విభజనకు అతీతంగా ఎదిగారు. చిరునవ్వులతో ప్రయాణికులకు సేవచేశారు. మరణంలో వారు తమ కుటుంబాలను విషాద స్థితిలో ఒక క్షణమైనా ఏకం చేశారు.

  • గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
  •  రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News