Friday, March 29, 2024

కామెంట్లే కడతేర్చాయి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి ఆత్మ హత్యకు సంబంధించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ జరిపింది. ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ సైఫ్ ర్యాగింగే కారణమని తేల్చింది కమిటీ. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌లో కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ వ్యవహారం ర్యాగింగ్ కిందకే వస్తుందని తెలిపింది. అందుకే సైఫ్ వేధింపులను ర్యాగింగ్‌గానే నిర్ధారించినట్లు కమిటీ పేర్కొంది. మానసిక వేధింపులు కూడా ర్యాగింగ్ కిందకే వస్తుందని కమిటీ వెల్లడించింది. అయితే ప్రీతిని భౌతికంగా వేధించినట్లు ఆధారాలు లేవని కమిటీ అధ్యక్షుడు, కెఎంసి ప్రిన్సిపాల్ అంటున్నారు. ఇకపోతే.. డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటికే సీనియర్ పిజి విద్యార్ధి సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు.

సైఫ్ ఫోన్ లో 17 వాట్సాప్ చాట్స్ పోలీసులు పరిశీలించారు. ముఖ్యంగా రెండు విషయాలలో ప్రీతిని డాక్టర్ సైఫ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఓ రోడ్డు ప్రమాదం కేసులో అనస్తీషియా రిపోర్ట్ ప్రీతి రాయడం, మరోవైపు రిజర్వేషన్ కారణంగా ప్రీతి ఫ్రీ సీటు పొందడంపై సైఫ్ ఆమెను టార్గెట్ చేసుకున్నాడని ప్రాథమికంగా గుర్తించారు. సైఫ్ ఫోన్ పరిశీలించిన పోలీసులు, యాంటీ ర్యాగింగ్ కమిటీ పలు కీలక విషయాలను గుర్తించారు. అనుషా, భార్గవి, LDD+ knockouts వాట్స్ అప్ గ్రూప్ చాట్స్ వివరాలు సేకరించి పరిశీలించారు. అందులో అనస్తీషియా డిపార్ట్మెంట్ లో ప్రీతిని సూపర్వైజ్ చేస్తున్న సీనియర్ డాక్టర్‌గా సైఫ్ ఉన్నాడు. రెండు ఘటనల ఆధారంగా ప్రీతిపై సీనియర్ సైఫ్ కోపం పెంచుకున్నాడు. డిసెంబర్ లో ఒక యాక్సిడెట్ కేసు విషయం లో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడు. ఆ ప్రమాదానికి సంబంధించి ప్రిలిమినరీ అనస్తీషియా రిపోర్టును మెడికో ప్రీతి రాసింది.

ప్రీతి రాసిన రిపోర్టును తమ వాట్సాప్ గ్రూప్ లో పెట్టి సైఫ్ హేళన చేశాడు. టాలెంట్ తక్కువున్నా రిజర్వేషన్ లో ఆమెకు ఫ్రీ సీట్ వచ్చిందంటూ ప్రీతిని సైఫ్ అవమానించాడు. తనతో ఏమైనా ప్రాబ్లమా అంటూ సైఫ్‌ను జూనియర్ ప్రీతి ప్రశ్నిం చింది. తనతో ఏమైనా సమస్య ఉంటే సంబంధిత డిపార్ట్ మెంట్ హెచ్‌ఒడి కి చెప్పాలని సైఫ్‌కు ప్రీతి సూచించింది. ఈ కారణాలతో ప్రీతిపై మరింత పగ పెంచుకున్న సైఫ్ జూనియర్ ప్రీతిని వేధించాలని నిర్ణయించుకున్నాడు. ప్రీతిని వేదించాలని తన స్నేహితుడు భార్గవ్‌కు సైఫ్ చెప్పాడు. RICUలో రెస్ట్ లేకుండా ప్రీతికి వరుస డ్యూటీ వేయాలని సైఫ్ సూచించాడు. రెగ్యూలర్‌గా గొడవలు, అభిప్రాయ బేధాలు వస్తున్న క్రమంలో ఫిబ్రవరి 21న హెచ్‌ఒడి నాగార్జునకి ప్రీతి ఫిర్యాదు చేసింది.

సైఫ్ తనను టార్గెట్ చేశాడని, తనతో సమస్య ఉంటే నేరుగా హెచ్‌ఒడికి ఫిర్యాదు చేయాలని సూచించిన పట్టించుకోకుండా గ్రూపులో మెస్సేజ్ లు పెట్టి తన పనిని తప్పుపట్టడం, రిజర్వేషన్ లో ఫ్రీ సీట్ కొట్టావంటూ వేధిస్తున్నాడని సీనియర్ సైఫ్‌పై ఫిర్యాదు చేసింది. ప్రీతి ఫిర్యాదుపై స్పందించిన డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలో ప్రీతికి, సీనియర్ సైఫ్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే ఆ కౌన్సెలింగ్ లో తప్పు ఎవరిదన్నదో తెలియదు కానీ ఆ మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఐదు రోజులపాటు ప్రాణాలతో పోరాడిన ప్రీతి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసింది. అయితే ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్య చేసి డ్రామాలు చేశారని ప్రీతి తల్లిదండ్రులు, సోదరుడు సంచలన ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News