Saturday, May 4, 2024

కేజ్రీవాల్‌కు జైలులో ఇన్సులిన్

- Advertisement -
- Advertisement -

టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బ్లడ్ సుగర్ లెవల్స్ హెచ్చుగా ఉండడంతో ఆయనకు తక్కువ డోసేజ్‌తో ఇన్సులిన్ ఇచ్చినట్లు తీహార్ జైలు అధికారులు మంగళవారం తెలిపారు. కాగా..ఆంజనేయ స్వామి ఆశీస్సుల కారణంగానే కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ దక్కిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభివర్ణించింది. దేశవ్యాప్తంగా మంగళవారం హనుమజ్జయంతి వేడుకలు జరుగుతున్న సందర్భంగా ఆప్ ఇదంతా ఆంజనేయస్వామి ఘనతేనని వర్ణించింది. ఎయిమ్స్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం సాయంత్రం 2 యూనిట్ల ఇన్సులిన్‌ను కేజ్రీవాల్‌కు ఇచ్చినట్లు తీహార్ జైలు అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కేజ్రీవాల్ బ్లడ్ సుగర్ లెవల్ 217గా ఉన్నట్లు గుర్తించామని, తీహార్ జైలులో కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ల సలహా మేరకు ఆయనకు ఇన్సులిన్ ఇవ్వాచమని ఆయన చెప్పారు.

సుగర్ లెవల్స్ ఒక స్థాయిని దాటితే ఇన్సులిన్ ఇవ్వవచ్చని తీహార్ డాక్లర్లకు ఎయిమ్స్ డాక్టర్లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సూచించారని అధికారి తెలిపారు. కాగా..హనుమాన్ జయంతిని తన నియోజకవర్గంలో జరుపుకున్న ఢిల్లీ క్యాబినెట్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తన వెంట ఆంజనేయుని వేషధారణలో ఒక చేతిలో గద, మరో చేతిలో ఇన్సులిన్ ఇంజక్షన్‌ను పట్టుకున్న పార్టీ కార్యకర్తతో కలసి జీపులో ఊరేగింపు నిర్వహించారు. ఆంజనేయ స్వామి తన శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇచ్చారని తెలిపారు. కోర్టు ఉత్తర్వులు జారీచేసినా జైలు నిరాకరించిందని, కాని హనుమంతుడి దీవెనలతో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ దక్కిందని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ త్వరగా విడుదల కావాలని ప్రార్థిస్తున్నట్లు సౌరభ్ తెలిపారు. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News