Wednesday, May 1, 2024

రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చా..

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు
ఇద్దరూ తోడు దొంగలే
బిఆర్‌ఎస్ అభ్యర్థులు పోటీ నుండి పారిపోతున్నారు
హిందువుల ఆత్మగౌరవం కోసం నేను కొట్లడుతా..

హిందువుల ఆత్మగౌరవం కోసం నేను కొట్లడుతా.. నేను ఎన్నడూ రాజకీయం కోసం హిందుత్వాన్ని వాడుకోను. కానీ హిందూ ధర్మ పరిరకర్షణ కోసం బరాబర్ రాజకీయం చేస్తా.. ఎందాకైనా పోరాడతా, నా ధర్మం పట్ల నాకున్న బాధ్యత.. ఎందుకంటే మేము పక్క హిందుత్వవాదులం..కాంగ్రెస్, బిఆర్‌ఎస్ మాదిరిగా కుహనా లౌకికవాదులం కాదు.. ఇంట్లో
దేవునికి దండం పెట్టుకొని ఇల్లు దాటగానే బొట్టు తుడుచుకునే వాళ్ళం కానేకాదు. కరీంనగర్ నుంచి వరంగల్, కరీంనగర్ నుంచి జగిత్యాల ప్రయాణం చేస్తే ప్రజల నడుములు విరిగేవి. అనేక ప్రమాదాలవుతున్నా ఎవరూ పట్టించుకోలే. కానీ నేను ఎన్నో కోట్ల నిధులు తెచ్చానని బండి తెలిపారు.

ప్ర: ఐదేళ్లలో మీరు సాధించిన విజయాలు?

జ:తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని గల్లీలోకి గుంజుకొచ్చి గడీల పాలనను బద్ధలు కొట్టిన. ఏ ప్రభుత్వమైతే ధర్నాలు, నిరసనలను నిషేధించిందో అదే ప్రభుత్వాన్ని ధర్నా చౌక్‌కే గుంజుకొచ్చిన. కెసిఆర్ పాలనలో విసిగిపోయిన, అన్యాయాలకు గురైన ప్రజలందరికీ అండగా ఉంటూ పోరాటాలు చేసిన. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం అన్నో ఇన్నో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చింది అంటే నా పోరాటం వల్లనే. ఆర్టీసీ ఆస్తులు అమ్మకుండా అడ్డుకున్న.. ప్రజా సంపదను రక్షించిన. కరీంనగర్ పార్లమెంట్‌లో పేపర్లకే పరిమితమైన అభివృద్ధి పనులను పట్టాలెక్కించిన. గతంలో కరీంనగర్ నుండి వరంగల్, కరీంనగర్ నుండి జగిత్యాల ప్రయాణం చేస్తే ప్రజల నడుములు విరిగేవి. అనేక ప్రమాదాలవుతున్నా ఎవరూ పట్టించుకోలే. నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేంద్రం సహకారంతో దాదాపు రూ. 4 వేల కోట్ల పైచిలుకు నిధులతో ఫోర్ లేన్ విస్తరణ పనులు ప్రారంభించేలా చేసిన. ముక్కు పిండి రైతుల వద్ద వడ్లు కొనేలా చేశాను. రాష్ట్రంలో 17 సీట్ల లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇప్పటికే బిఆర్‌ఎస్ నాయకులు పోటీ నుండి పారిపోతున్నారు. కాంగ్రెస్ తమ క్యాండిడేట్స్ కోసం తర్జనభర్జన పడుతోంది

ప్ర: ఎంపిగా ఉంటూ కరీంనగర్ పార్లమెంట్‌కు నయాపైసా తీసుకురాలేదనే దానిపై మీరేమంటారు?

జ: ఆ మాట అనేటోళ్లకు సిగ్గులేదంటా.. కళ్లముందే రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చిన వివరాలు గ్రామ గ్రామాన కన్పిస్తుంటే బండి సంజయ్ నయాపైసా తీసుకురాలేదంటే ఏమనాలి. ఒకటి.. వాళ్లు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏ నాడూ తిరగకపోయి అయినా ఉండొచ్చు, లేదా రాజకీయ లబ్ధి కోసం పచ్చి అబద్ధాలైనా ఆడుతుండొచ్చు.

ప్ర: ఎంపి అయ్యాక చేసిన అభివృద్ధి పనుల్లో ముఖ్యమైనవి చెప్పగలరా?

జ: నేను ఎంపి అవ్వగానే దేశమంతా దాదాపు రెండేళ్లపాటు కరోనా సం క్షోభం ఎదుర్కొంది. ఎంపి లాడ్స్ నిధులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేది. నా కరీంనగర్ ప్రజల ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వాన్ని ఒప్పించి కరీంనగర్ – వరంగల్ ఫోర్ లేన్ విస్తరణ పనులకు రూ.2146.86 కోట్లు, కరీంనగర్ – జగిత్యాల ఫోర్‌లేన్ విస్తరణ పనులకు రూ. 2151.35 కోట్లు, ఎల్కతుర్తి -, సిద్దిపేట రోడ్డు విస్తరణ పనుల కోసం రూ. 578.85 కోట్లు, తీగలగుట్ట ఆర్‌ఒబి నిర్మాణం విషయంలో పైసలియ్యకుండా కెసిఆర్ ప్ర భుత్వం చేతులెత్తేస్తే సేతుబంధన్ పథకం కింద కేంద్రమే పూర్తిగా నిధులను (రూ.154.85 కోట్లు) విడుదల చేసేలా ఒప్పించి పనులు స్టార్ట్ చేయించిన. అట్లాగే సిఆర్‌ఐఎఫ్ ద్వారా రూ.328.5 కోట్లు, కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ. 51.80 కోట్లు తీసుకురావడంతోపాటు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయించిన. శాతవాహన యూనివర్సిటీ కి 12 బి హోదా తీసుకొచ్చిన. ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీకి అటానమస్ హోదా తెచ్చిన. కేంద్ర పథకాల ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 8041 ఇండ్లకు 145 కోట్ల నిధులు మంజూరు చేయించిన. అమృత్ 1.0 ద్వారా రూ.281 కోట్లతో 12 ప్రాజెక్టులు, అమృత్ 2.0 ద్వారా రూ.583.27 కోట్లతో 11 ప్రాజెక్టులు గుర్తించాం. పిఎం స్వనిధి ద్వారా 46,974 మంది స్ట్రీట్ వెండర్స్‌కు రూ. 76.48 కోట్ల రుణ సహాయం చేశా. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు రూ. 756.73 కోట్ల సహాయం అందించా. ఉజ్వల యోజన ద్వారా 50647 కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా. సిరిసిల్ల చేనేత గొప్పతనం దేశమంతా తెలిసే ప్రయత్నం చేశాను.

ప్ర: ప్రజాహిత యాత్రపై స్పందన ఎలా ఉంది..?

జ: గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పెద్ద లీడర్లు కుమ్మక్కై కుట్ర చేసి నన్ను ఓడించారని పార్లమెంట్‌లోని యువకులు, మహిళలు చాలా సందర్భాల్లో బాధ పడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధుల విషయంలో, నేను పార్లమెంట్‌కు తెచ్చిన నిధుల విషయంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మమ్ములను తప్పుదోవ పట్టించారని విస్తుపోయారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుంటే మేము అందరం మా కుటుంబసభ్యులతో ఆత్మహత్య చేసుకునేవాళ్లం అని బాధపడ్డారు. తన భరోసాతోనే మేము ధైర్యంగా ఉన్నాం అని నిరుద్యోగ యువత తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో స్థానిక నాయకులు నా యాత్రకి సంఘీభావం తెలిపారు.

ప్ర: రాముని అక్షింతలపై పొన్నం మాటలపై మీ సమాధానం?

జ: రేషన్ బియ్యం అంటూ అవహేళన చేయడం అంటే పేద ప్రజలను అవహేళన చేయడమే.. కాంగ్రెస్ నాయకుల అహంకారానికి, అధికార దర్పానికి అలాంటి మాటలు నిదర్శనం.. అక్షింతలు అనేటివి హిందువుల భక్తి భావనకు సంబంధించినవి. వాటిని అవహేళన చేయడం హిందూ సమాజాన్ని, విశ్వాసాలను కించపరచడమే.. రేషన్ షాపుల్ల ఇకనుండి మీ ప్రభుత్వం బాస్మతి బియ్యం, సన్న బియ్యం ఇవ్వాలి. మైనారిటీల మెప్పు కోసం కాంగ్రెస్ నాయకులు ఎలాంటి మాటలైనా మాట్లాడుతారు.. హిందువును, దేశాన్ని కించపరిచే వ్యక్తులను మేధావులు అంటారు.. అది వారి డిఎన్‌ఎలోనే ఉంది. గాంధీ గారి ముసుగు వేసుకున్న జిన్నా భక్తులు ఈ కాంగ్రెస్ నాయకులు.

ప్ర: బండి సంజయ్ హిందువులను రెచ్చకొట్టి లబ్ధి పొందారనే మీ ప్రత్యర్థులు ప్రచారంపై ఏమంటారు?

జ: హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది ఎంఐఎం పార్టీ.. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానని ఆ పార్టీ అధినేత ఒ వైసి చెబితే చర్యలు తీసుకోకుండా ఆ పార్టీతో పదేళ్లపాటు సంసారం చే సింది బిఆర్‌ఎస్. అధికార మనుగడ కోసం ఒవైసీతో అంటకాగుతోంది కాం గ్రెస్. ట్యాంక్ బండ్‌పై ఎన్‌టిఆర్, పివి విగ్రహాలను కూల్చేస్తానని మాట్లాడితే కనీసం ఆ వ్యాఖ్యలు తప్పని కూడా ఖండించని పార్టీలు కాంగ్రెస్, బిఆర్‌ఎస్. కరీంనగర్ కేంద్రంగా హిందువులను గతంలో కించపర్చి మాట్లాడింది ఎవరో కరీంనగర్ హిందువులకు తెలుసు.. హిందువుల మనోభావాలు దెబ్బతింటుంటే మౌనం ఉండటం నాకు చేతకాదు, హిందువుల ఆత్మగౌరవం కోసం నేను కొట్లడుతా.. నేను ఎన్నడూ రాజకీయం కోసం హిందుత్వాన్ని వాడుకోను, కానీ హిందూ ధర్మ పరిరకర్షణ కోసం బరాబర్ రాజకీయం చేస్తా.. ఎందాకైనా పోరాడతా. నా ధర్మం పట్ల నాకున్న బాధ్యత.. ఎందుకంటే మేము పక్క హిందుత్వవాదులం.. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ మాదిరిగా కుహనా లౌకిక వాదులం కాదు… ఇంట్లో దేవునికి దండం పెట్టుకొని ఇల్లు దాటగానే బొట్టు తుడుచుకునే వాళ్ళం కానేకాదు..

ప్ర: త్రెలంగాణలో బిజెపి ఎన్ని ఎంపి సీట్లు గెలుస్తుంది?

జ: 17 సీట్ల లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇప్పటికే బిఆర్‌ఎస్ నాయకులు పోటీ నుండి పారిపోతున్నారు. కాంగ్రెస్ తమ క్యాండిడేట్స్ కోసం తర్జన భర్జన పడుతోంది. కేంద్రంలో కూడా మళ్ళీ రాబోయేది బిజెపి ప్రభుత్వమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News