Sunday, April 28, 2024

ఫొన్ ట్యాపింగ్‌లో భూపాలపల్లి ఎఎస్పీ అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి ఎఎస్పి భుజంగరావును సిట్ అధికారులు శనివారం అరెస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో డిఎస్పి ప్రణీత్ రావును సిట్ అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రణీత్ రావుతో కలిసి ఇంటెలీజెన్స్‌లో పనిచేసిన సమయంలో భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేస్తున్న పోలీసులు ఇద్దరు ఎఎస్పిలు తిరుపతన్న, భుజంగరావును విచారణకు పిలిచారు. ఉదయం నుంచి ఇద్దరిని విచారణ చేసిన అధికారులు, భుజంగరావును ఎనిమిది గంటల పాటు విచారణ చేసి సాయంత్రం అరెస్టు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. ఎఎస్పి భుజంగరావును ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నట్లు తెలిసింది. భుజంగరావు, ప్రణీత్ రావును ఎదురెదురుగా కూర్చొబెట్టి పోలీసులు విచారణ చేసినట్లు తెలిసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావు ఆరు రోజుల కస్టడీ ముగియడంతో ఆదివారం జడ్జి ఇంట్లో హాజరుపరచనున్నారు. మళ్లీ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరనున్నట్లు తెలిసింది. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఎస్‌ఐబిలో పనిచేసిన పలువురు అధికారులు, కానిస్టేబుళ్లను సిట్ విచారణకు పిలుస్తున్నట్లు తెలిసింది. నోటీసులు ఇవ్వడంతో గతంలో ఇంటెలీజెన్స్‌లో పనిచేసిన ఎఎస్పి తిరుపతన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు బిఆర్‌ఎస్ ప్రభుత్వ సమయంలో ఇంటెలీజెన్స్, ఎస్‌ఐబిలో పనిచేసిన వారిని విచారణకు పిలవనున్నట్లు తెలిసింది.

మాజీ అధికారుల ఇళ్లల్లో సోదాలు…
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో పోలీసులు శనివారం సోదాలు చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్ రావు ఇళ్లతోపాటు పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇంటెలిజెన్స్ మాజీ ఎస్పీ భుజంగరావు, ఎస్‌ఐబి ఎఎస్పీ తిరుపతన్న ఇళ్లల్లో కూడా సోదాలు చేశారు. పంజాగుట్ట పోలీసులు ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఓ న్యూస్ చానల్ ఎండీ శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో కూడా పోలీసులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే, శ్రవణ్ రావు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. చానల్ కార్యాలయంలో, ఇంటిలో సర్వర్లు పెట్టి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్ దాటిన అధికారులు…
ఫోన్ ట్యాపింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ పోలీస్ అధికారులు ప్రభాకర్‌రావు, రాధాకిషన్ రావు, ఐ న్యూస్ ఛాలన్ అధినేత శ్రీధర్ రావు విదేశాలకు పారిపోయినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు అమెరికాలో, శ్రవణ్ కుమార్ రావు లండన్‌లో ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ విషయం బయటకు తీయగానే తమ మెడకు చుట్టుకుంటుందని భావించిన వీరు ముందుగానే విదేశాలకు పారిపోయినుట్లు తెలిసింది.

రేవంత్ ఇంటి సమీపంలోనే ఆఫీస్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే మాజీ డిఎస్పి ప్రణీత్ రావు ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి, అతడి సోదరులు,కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారని విచారణలో బయటపడింది. ఉప ఎన్నికల సమయంలో ఇంటెలీజెన్స్‌లో పనిచేస్తున్న ఎఎస్పి భుజంగరావు, తిరుపత్న వాహనాల్లోనే బిఆర్‌ఎస్‌కు చెందిన వారు డబ్బులు తరలించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

ఎన్నికల్లో ట్యాపింగ్…
మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో జోరుగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలిసింది. కరీనంగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఫోన్‌ను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు తెలిసింది. ఉప ఎన్నిక సమయంలో బిఆర్‌ఎస్‌తో ఫోటీ పడుతున్న అభ్యర్థులు వారి అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసి వారి సమాచారం తెలుసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా వారు డబ్బులు తరలిస్తున్న విషయాలు తెలుసుకుని వాటిని ముందుగానే పోలీసులు పట్టుకునే విధంగా చేసినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News