Sunday, April 28, 2024

లిక్కర్ స్కామ్‌లో కవిత మేనల్లుడు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇడి అధికారులు కొత్త పేరు బయటపెట్టారు, ఆయన ద్వారానే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంకు సంబంధించిన లావాదేవీలు జరిపారని, అతడే వచ్చిన డబ్బులను పెట్టుబడిగా పెట్టారని పేర్కొన్నారు. కవిత మేనల్లుడు మేక శరణ్ లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తి అని ఇడి అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. శరణ్‌ను విచారణకు రావాల్సిందిగా ఎన్ని సార్లు నోటీసులు పంపించినా హాజరు కావడంలేదని, కవితను విచారిస్తే అతడి గురించి తనకు తెలియదని విచారణలో ఏ విషయం చెప్పడంలేదని ఇడి అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో సౌత్ గ్రూప్ లాబీ డబ్బుల లావాదేవీల్లో శరణ్‌దే కీలక పాత్ర ఉన్నట్లు ఇడి అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాసింత ఊరట దక్కింది.

ఓ వైపు వరుస ఈడీ సోదాలు, మరోవైపు కస్టడీలో విచారణతో సతమతం అవుతున్న కవిత కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి పది నిమిషాలు మాట్లాడేందుకు అనుమతివ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరింది. దీనికి కోర్టు అంగీకరించడంతో కుటుంబ సభ్యులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలతో మాట్లాడింది. కవితకు ఇడి కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఇడి కోరగా, మూడు రోజులకు మాత్రమే అనుమతిచ్చింది. ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి.. ఇంటి భోజనం తెప్పించుకోవడానికి కూడా కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

మేనల్లుడు శరణ్ ఇంట్లో సోదాలు…
కవిత మేనల్లుడు శరణ్ ద్వారా లావాదేవీలు జరిగినట్లు ఇడి అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే కవిత ఇంట్లో ఇడి చేసిన సోదాల్లో శరణ్ మొబైల్ లభ్యమైంది. దాని ద్వారా శరణ్‌ను విచారణ చేయాలని ఇడి భావిస్తుండగా అతడు అందుబాటులోకి రావడంలేదు. దీంతో ఇడి అధికారులు కవిత ఆడపడుచు అఖిల, మేనల్లుడు శరణ్ ఇంట్లో శనివారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లిక్కర్ స్కాంకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. శనివారం ఉదయం 6:30 గంటలకే హైదరాబాద్‌కు వచ్చిన ఇడి అధికారులు కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు చేశారు. మొత్తం ఏడుగురు ఇడి అధికారుల బృందం ఈ సోదాలు చేస్తోంది. కవిత అరెస్ట్ అనంతరం ఇలా సోదాలు జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

కోర్టుకు వచ్చిన కవిత భర్త…
కవితను చూసేందుకు ఆమె భర్త అనిల్, ఇద్దరు కుమారులు రౌస్ అవెన్యూ కోర్టుకు వచ్చారు. బీఆర్‌ఎస్ నేతలు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, మాలోత్ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, పలువురు జాగృతి, బీఆర్‌ఎస్ కార్యకర్తలు రౌస్ అవెన్యూ కోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో కవిత కోర్టు అనుమతి అడగడంతో అనుమతించింది, దీంతో వారితో పది నిమిషాలు మాట్లాడింది. శుక్రవారం రాత్రి కవిత కుమారుడు ఆర్య, కవిత కుటుంబ సభ్యులు, ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు ఇడీ కార్యాలయం లోపలికి వెళ్లి కవితను కలిశారు. ఇవాళ మరోసారి మాట్లాడాలని కవిత కోరడంతో కోర్టు అంగీకరించింది.

ఈడీ వాదనలు…
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇడి కస్టడి ముగియడంతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఇడి అధికారులు హాజరుపర్చారు. ఈడీ తరపున న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు వినిపించారు. కవితను విచారించేందుకు మరో అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. నలుగురి స్టేట్మెంట్‌పై కవితని అడిగామని, కిక్ బ్యాగ్స్ గురించి కూడా అడిగినట్లు తెలిపారు. అయితే విచారణకు కవిత సహకరించడం లేదని, సమీర్ మహేంద్రతో కలిసి కవితను ప్రశ్నించాలని, లిక్కర్ స్కామ్‌లో కోట్లలో కిక్ బ్యాక్‌లు అందాయన్నారు. సౌత్ గ్రూప్‌కు రూ.100 కోట్లు చేరాయని తెలిపారు. కవిత మొబైల్ డేటాను విశ్లేషించామని, అయితే ఫోన్‌లోని డేటాను తొలగించారన్నారు.

కవిత కుటుంబ సభ్యులు వివరాలు ఇవ్వడం లేదని తెలిపారు. కవిత మేనల్లుడి వ్యాపారానికి సంబంధించి వివరాలు అడిగామని.. తనకు తెలియదని ఆమె సమాధానం ఇచ్చారన్నారు. సోదాల్లో కవిత మేనల్లుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, అప్పటి నుంచి మేనల్లుడు శరణ్ కనిపించడం లేదని కోర్టుకు ఇడి తరపు న్యాయవాది వెల్లడించారు. మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగామని, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. మేక శరణ్‌కు సంబంధించి సమాచారం ఇవ్వడంలేదని చెప్పారు. సమీర్ మహేంద్ర కూడా కవిత బినామీ అని, ఇప్పటికీ ఇంకా సోదాలు జరుగుతున్నాయని ఇడి తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

వివరాలు ఎలా ఇస్తారు : కవిత న్యాయవాది
ఇడి కస్టడీలో ఉన్న కవితను బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఐటీ రిటర్న్ అడుగుతున్నారని కస్టడీలో ఉన్నప్పుడు డాక్యుమెంట్ వివరాలు ఎలా ఇస్తారని కవిత తరపు న్యాయవాది వాదించారు. కవిత తరపున బెయిల్ పిటిషన్ వేశామని, బెయిల్ పిటిషన్‌పై ఇడికి నోటీసులు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే బెయిల్ పిటిషన్‌పై ఇడి తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం బెయిల్‌కు విచారణ అర్హత లేదని ఇడి పేర్కొంది.

రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు….
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ రిపోర్టును ఇడి విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఇడి కీలక విషయాలను వెల్లడించింది. ఇడి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మేకా శరణ్ కొత్త పేరు తెరపైకి వచ్చింది. గత ఏడు రోజులుగా కవిత విచారణకు సహకరించడం లేదని రిపోర్టులో తెలిపింది. ‘కవిత నుంచి మరింత సమాచారాన్ని సేకరించాలని, లిక్కర్ కేసులో మేకా శరణ్ పాల్గొన్నట్లు వెల్లడైంది. కేసులో దర్యాప్తునకు సంబంధించిన సమాచారం శరణ్ దగ్గరుంది. కవిత మాత్రం శరణ్ ఎవరో తెలియదని చెబుతున్నారు.

మేక శరణ్ విషయంలో దర్యాప్తునకు సహకరించడం లేదు. ఇందులో భాగంగా ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నాం. నలుగురు నుంచి వాంగ్మూలాలు తీసుకున్నాం. దర్యాప్తులో తేలిన విషయాలపై కవితను ప్రశ్నించాం. ఈడీ విచారణలో కవిత మొబైల్ డేటాను పరిశీలించాం. డేటా డిలీట్ చేశారని గుర్తించాం. కుటుంబ వ్యాపార వివరాలు, ఆర్థిక అంశాల పత్రాలు వివరాలు ఇవ్వాలని కోరాం. కవితను కుటుంబ సభ్యులు, న్యాయవాది కలిసే సమయంలో డాక్యుమెంట్స్ వివరాలను తెలియజేస్తానని చెప్పారు. ఇప్పటివరకూ ఎలాంటి డాక్యుమెంట్స్ అందించలేదు’ అని రిపోర్టులో ఇడి పేర్కొంది.

కీలక సమాచారం రాబట్టిన ఇడి…
కస్టడీలో ఉన్న కవిత నుంచి ఇడి అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సమాచారంతోనే మరోసారి ఇడి రంగంలోకి దిగిందని సమాచారం. ఉదయం నుంచి జరిగిన సోదాల్లో కీలక పత్రాలు, సమాచారం రాబట్టినట్లు తెలిసింది. కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ బ్యాంకు లావాదేవీలను నిశితంగా పరిశీలించగా, ఆడపడుచు అఖిల విషయం బయటికొచ్చిందని అందుకే ఈ సోదాలని తెలిసింది. కవిత తర్వాత ఇదే కేసులో మరికొందరిని అరెస్టు చేయవచ్చని, మళ్లీ కొందరి ఇళ్లల్లో సోదాలు చేయవచ్చని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News